ఈడీ దెబ్బ: వైసిపికి ఆర్థిక కష్టాలు, తేల్చి చెప్పిన జగన్, వారికి గాలం!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ.750 కోట్ల ఆస్తులను ఈడీ ఇటీవల అటాచ్ చేసింది. అదే సమయంలో, ఈ నెలలో గడపగడపకూ వైసిపి పేరుతో ఆ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు చెప్పాలని నిర్ణయించింది.
ఈడీ దెబ్బ కారణంగా గడపగడపకూ అయ్యే ఖర్చు స్థానిక నేతలే పెట్టుకోవాలని వైసిపి అగ్రనేతలు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మూడుసార్లు జగన్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, తాజాగా పెద్ద మొత్తంలో షాకిచ్చింది. దీంతో పార్టీకి ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం హైదరాబాదులోని లోటస్ పాండ్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 8 నుంచి పార్టీ తరఫున 'గడపగడపకూ వైసీపీ' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు.
దాదాపు ఆరు నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ నుంచి నిధులేమీ అందవని ఆ సమావేశంలో తేల్చి చెప్పారని తెలుస్తోంది. కేవలం స్టేషనరీ మాత్రమే పార్టీ కార్యాలయం నుంచి అందుతుందని, మిగిలిన ఖర్చులన్నీ స్థానిక నేతలే భరించాలని జగన్ చెప్పారని అంటున్నారు.
తన ఆస్తులు ఈడీ అటాచ్లోకి వెళ్లిపోవడంతో పార్టీ ఆర్థిక ఇబ్బందులో చిక్కుకుందని చెప్పారని, గడపగడపకు వైసీపీ కార్యక్రమానికి పైసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని అంటున్నారు.
పార్టీ కార్యక్రమాలకు కొనసాగించేలా కాస్తంత డబ్బులు కలిగిన నేతలను పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జులుగా నియమించాలని కూడా ఆయన యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే, పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో పలువురిని గుర్తించారని, వారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోందని అంటున్నారు.