పులివెందులలో భారతి..హిందూపురంలో వసుంధర!
కడప/అనంతపురం: పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడేక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యాటనలు సాగిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులకు తోడుగా వారి కుటుంబ సభ్యులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తోన్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన భార్య వైఎస్ భారతి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. రావాలి జగన్ కావాలి జగన్ పేరు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సింహాద్రిపురం, తొండూరు, లింగాల పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో కొన్నింట్లో ఇదివరకే ఓ దఫా పర్యటనలు పూర్తి చేశారు.
హిందూపురంలో వసుంధర..
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు మద్దతుగా ఆయన భార్య ప్రచార బరిలో దిగారు. మూడురోజులుగా ఆమె హిందూపురంలో ఉంటూ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలాల సంఖ్య పరిమితంగా ఉండటంతో ఆమె పని తేలికవుతోంది. హిందూపురం, లేపాక్షి, చీలమత్తూరు మండలాలు మాత్రమే హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. దీనితో ఆమె ఆయా మండలాలు, గ్రామాల్లో కలియ తిరుగుతున్నారు. తన భర్తను గెలిపించాలని కోరుతున్నారు.
బాబాయ్ కోసం సినీ రచయిత..
సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన బాబాయ్ కోన రఘుపతి గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. బాబాయ్ కోసం కోన వెంకట్.. బాపట్ల పరిధిలోని మండలాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా, జనసేన పార్టీ పవన్ కల్యాణ్ పైనా కోన వెంకట్ ఘాటు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
అన్న కోసం దర్శకుడు..
సీనీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న కురసాల కన్నబాబు స్వయానా కళ్యాణ్ కృష్ణకు సోదరుడు. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలకు పరిచయం అయ్యారు కళ్యాణ్ కృష్ణ. అనంతరం నాగార్జున కుమారుడు నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం, రవితేజతో నేల టికెట్ సినిమాలను తీశారు. నేల టికెట్ తప్ప.. ఆయన దర్శకత్వం వహించిన రెండు సినిమాలూ సూపర్ హిట్ గా నిలిచాయి.