ఎన్నికలు వాయిదా.. కోడ్ ఎత్తివేత: సుప్రీం ఆదేశాలు: ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి అడ్డంకులు తొలగించిందా? ఇదివరకే ప్రకటించిన ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ చేసిందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. ప్రవర్తనా నియమావళిని తక్షణమే ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడం ఊరట కలిగించేదేనని వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త పథకాలను ప్రకటించొద్దని ఆదేశించినా..
ఉగాది నాడు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. దీనికి అవసరమైన భూసేకరణ కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేంత వరకూ కొనసాగింది. ఈ పరిస్థితుల్లో దీన్ని కొత్త పథకంగా భావించడానికి వీల్లేదనేది ప్రభుత్వ పెద్దల వాదన. మూడు నెలల ముందే ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

ముందు నిర్ణయించుకున్నట్టే..
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసే విషయంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవచ్చని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వెంటనే ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం మంచి పరిణామమేనని చెబుతున్నారు. దీనిప్రకారం.. ముందే నిర్దేశించుకున్నట్లుగా ఈ నెల 25వ తేదీన ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి అవకాశం లభించినట్టయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

25 లక్షల మందికి
ఉగాది నాటికి ఒకేసారి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు వెసలుబాటు కల్పించిందని చెబుతున్నారు. ఫలితంగా- ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లగలిగే పరిస్థితులు, వాతావరణం ఏర్పడిందనే అభిప్రాయాలు అధికార పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోంది. సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పుకొని మరీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తమకు మరింత కలిసి వస్తుందని అంచనా వేస్తున్నాయి.
Recommended Video

అధికార పార్టీ దౌర్జన్యానికి అడ్డుకట్ట..
మరోవంక- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి, రౌడీయిజానికి తాము అడ్డుకట్ట వేయగలిగామని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. అప్రజాస్వామ్యంగా గెలవడానికి వైఎస్ఆర్సీపీ భారీ కుట్రలు పన్నిందని, సుప్రీంకోర్టు తీర్పు.. వైసీపీ నాయకులు గుణపాఠంగా మారిందని అంటున్నారు. ఇదే కోణంలో తాము ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆరు వారాల పాటు గడువు లభించడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ లోటుపాట్లను సరిచేసుకోవడానికి కూడా వెసలుబాటు కలిగినట్టయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆరు వారాల తరువాత జరిగే ఎన్నికల్లో అధికార పార్టీని మట్టి కరిపిస్తామని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications