ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ..!!
ఏపీలో ఎన్నికల వేళ అధికారుల పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పలువురు ఐపీఎస్ అధికారుల పైన చర్యలు తీసుకుంది. తాజాగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో ఒకరైన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నూతన డీజీపీగా నియమించింది.
ఏపీ నూతన డీజీపీగా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. కొత్త డీజీపీ పై కసరత్తు చేసిన తరువాత ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం విధుల్లో చేరాలని సూచించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వు లు జారీ చేశారు. తన తర్వాతి ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్రెడ్డిని ఆదేశించారు. ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్రనాథ్ రెడ్డి.. తన బాధ్యతల్ని శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చి కి అప్పగించారు. రాజేంద్రనాథ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 17 నుంచి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా వరుస ఫిర్యాదులతో ఈసీ బదిలీ వేటు వేసింది.

ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం నూతన డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లను ప్రతిపాదించింది. తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే, వీరి సర్వీసు రికార్డును పరిశీలించిన ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను నూతన డీజీపీగా ఖరారు చేసింది. తక్షణం విధుల్లో చేరాలని నిర్దేశించింది. మరో వారం రోజుల్లో ఏపీలో పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు డీజీపీగా వ్యవహరించిన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు నూతన డీజీపీకి వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ నిర్వహణ సవాల్ గా మారుతోంది. ఈ సాయంత్రం హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications