బీజేపీకి బిగ్ రిలీఫ్ : తిరుపతి ఉపఎన్నికలో నవతరం పార్టీకి 'గాజు గ్లాసు' గుర్తు రద్దు...
తిరుపతి ఉపఎన్నికలో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించడంపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో జనసేన బీజేపీ అభ్యర్థికి మద్దతునిస్తున్న నేపథ్యంలో... అధికార పార్టీనే ఈ కుట్రకు తెరలేపిందని ఇరు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం నవతరం పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేసింది. దీంతో బీజేపీకి పెద్ద ఊరట లభించినట్లయింది.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ నేతలు సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, సీఎం రమేశ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు సోమవారం(ఏప్రిల్ 5) కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి గాజు గ్లాసు గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించడంపై ఫిర్యాదు చేశారు.తక్షణమే దీన్ని విచారించి ఆ పార్టీకి మరో గుర్తు కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... ఎట్టకేలకు గుర్తును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ తరుపున రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇలాంటి తరుణంలో జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును నవతరం పార్టీకి కేటాయించడం జనసేన,బీజేపీ వర్గాల్లో అలజడి రేపింది. ఓటర్లను గందరగోళపరిచేందుకు అధికార పార్టీయే ఈ కుట్రకు తెరలేపిందని రెండు పార్టీలు ఆరోపించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో,ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును మరో పార్టీకి కేటాయించడమేంటని ప్రశ్నించాయి.
ఒకేసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికల్లో ఒకే గుర్తును వేర్వేరు పార్టీలకు కేటాయించడం కుట్రపూరితమేనని ఆరోపించాయి. వెనువెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నవతరం పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తు రద్దయింది. ఆ పార్టీకి మరో గుర్తు కేటాయించనున్నారు.












Click it and Unblock the Notifications