ఈసీ Vs సీయం మధ్యలో నలుగుతున్న అధికారులు : సమీక్షల్లో పాల్గొన్నవారికి ఈసీ లవ్ లెటర్లు !
ఏపిలో అధికారులు నలిగిపోతున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి సమీక్షలు..మరో వైపు సమీక్షల్లో ఎలా పాల్గొంటారంటూ ఎన్నికల సంఘం నోటీసులు. ఎన్నికల సంఘం..ముఖ్యమంత్రి మధ్య ఎవరికీ సమాధానం చెప్పుకోలేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సమీక్షల పైన సీరియస్ అయిన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఆయన సమీక్షల్లో పాల్గొన్న అధికారుల నుండి వివరణ కోరారు.
రాహుల్ తో కలిసి బాబు : ఎన్నికల ప్రచారం కోసం కలయిక : ఏపిలో మాత్రం వేర్వేరు దారులు..!
సీయం సమీక్షల్లో అధికారులు..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే సమీక్షలు నిర్వహించటం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆయన తాగునీటి ఎద్దడి..పోలవరం పై ప్రజా వేదికలో సమీక్ష నిర్వహించారు. ఈ రెండు సమీక్షలకు సంబంధింత అధికారులు హాజరయ్యారు. పోలవరం సమీక్షకు మంత్రి దేవినేని ఉమాతో పాటుగా జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషన్ కుమార్ ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక, గురువారం సచివాలయం వచ్చిన ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణం పై సీఆర్డిఏ అధికారులతో సమీక్షించారు. ఆ సమీక్షలో మంత్రి నారాయణతో పాటుగా మున్సిపల్, సీఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు. అప్పటికే ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘన పైన స్పందించటంతో ఆ తరువాత ముఖ్యమంత్రి ముందుగా నిర్ణయించుకున్న శాంతి భద్రతల సమీక్షను రద్దు చేసుకున్నారు. కేవలం హోం శాఖ కార్యదర్శి అనురాధ సీయంకు బ్రీఫింగ్ ఇచ్చారు.
సంజాయిషీ కోరిన ఎన్నికల సంఘం..
పోలింగ్ ముగిసినా..ఫలితాలు వచ్చి గెజిట్ విడుదల అయ్యే వరకూ కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాగునీటి ఎద్దడి పై రివ్యూ చేయటాన్ని ఎన్నికల సంఘం ప్రస్తావించటం లేదు. పోలవరం రివ్యూ .. అమరావతి సమీక్షల పైనే ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘనగా భావిస్తోంది. కోడ్ అమల్లో ఉండగా అధికారులు ఈ సమీక్షల్లో ఎలా పాల్గొన్నారో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేసారు. దీనికి సంబంధించి ఈ సమీక్షల్లో పాల్గొనటం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని దీని పైన వివరణ ఇవ్వాలంటూ జల వనరుల శాఖ..మున్సిపల్ శాఖ ముఖ్య అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. దీని పై సమాధానం ఇవ్వాలని అందులో ఆదేశించారు.
ఆందోళనలో అధికారులు..
ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించిన సమయంలో హాజరు కావాలంటూ తమకు సీయంఓ నుండి వచ్చిన సమాచారం ఆధారంగానే తాము సమీక్షలకు వెళ్లామని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలకు వెళ్లకుంటే ఇబ్బంది పడేదీ తామేనని అధికారులు వాపోతున్నారు. మరో వైపు ఎన్నికల సంఘం సీయం నిర్వహించే సమీక్షలకు ఎందుకు వెళ్లారంటూ వివరణ కోరటం పైనా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీక్షలు నిర్వహించకుండా ముఖ్యమంత్రికి ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నియంత్రించాలని..పాల్గొన్న తమను వివరణ కోరటం ఏంటన్నది వారి ఆవేదనకు కారణం. ఇక, ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుల పై ప్రభుత్వ ప్రధాక కార్యదర్శి సైతం అధికారులకు మద్దతుగా కాకుండా..వారి నుండి వివరణ కోరటం పైనా అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పుడు ఎన్నికల సంఘం..సీయం మధ్య అధికారులు నలిగి పోతున్నారు.