ఏపీలో మహిళా ఓటర్లే కీలకం- మొత్తం 4.07 కోట్లు : భీమిలిలో గరిష్ఠం - జిల్లాల వారీగా ఇలా..!!
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనన్నా..మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఏపీలోని ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 4,07,06,804 మంది ఓటర్లుండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం కొత్తగా 1,69,916 మందిని జాబితాలో చేర్చింది. 1,40,372 మందిని తొలగించింది. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,62,880 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
ఏపీలో మొత్తం ఓటర్లు 4.07 కోట్ల మంది
తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,07,36,279 గా తేల్చారు. మొత్తం 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో పెరుగుదల... నాలుగు జిల్లాల్లో తగ్గుదల ఉన్నట్లుగా గుర్తించారు. అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాగా తూర్పు గోదావరి మొదటి స్థానంలో ఉండగా..తరువాతి స్థానాల్లో గుంటూరు..విశాఖ.. కృష్ణా జిల్లాలు ఉన్నాయి. తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో విజయనగరం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. శ్రీకాకుళం, అనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ గా ఉన్నారు.
భీమిలిలో అత్యధిక ఓటర్లు
రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 17,343 మంది, ప్రకాశం జిల్లాలో 8,268 మంది, విశాఖపట్నంలో 7,897 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ (721) సర్వీసు ఓటర్లు నెల్లూరు జిల్లాలో ఉన్నట్లుగా జాబితాలో తేల్చారు. ఇక, నియోజకవర్గాల వారీగా చూస్తే విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 3,29,669 మంది ఓటర్లు ఉన్నారు. గాజువాకలో 3,29,540 మంది, కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో 3,11,272 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తమ నివేదికలో స్పష్టం చేసింది.
Recommended Video
మహిళా ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్
ఇక, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతి తక్కువగా 1,67,596 మంది, కృష్ణా జిల్లా పెడనలో 1,71,454 మంది, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో 1,79,103 మంది ఓటర్లు ఉన్నట్లుగా గణాంకాలు తేల్చాయి. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న మొదటి మూడు నియోజకవర్గాల్లో రెండు విశాఖ జిల్లాలోనూ, అతి తక్కువ ఓటర్లున్న తొలి మూడు నియోజకవర్గాల్లో రెండు పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పటివకి 13,85,239 మంది ఓటర్లు పెరిగారు.