తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్: షెడ్యూల్ ఇదే: బలం పెంచుకునే ఛాన్స్?
అమరావతి: ఏపీలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మూడుదశల్లో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొల విడత పోలింగ్ ముగిసింది. శనివారం రెండో విడత పోలింగ్ను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. పంచాయతీ పోరు ముగిసిన వెంటనే- మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఏపీలో మరో ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది.
శాసన మండలికి సంబంధించిన ఎన్నికలు అవి. దీని షెడ్యూల్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. ఏపీలో ఖాళీ కానున్న రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం విడుదల చేసింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ, తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా ఒకేసారి ఎన్నికలు రాబోతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది.
నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 23. మరుసటి రోజు నామినేషన్ పత్రాల స్క్రూటినీ ఉంటుంది. వాటిని ఉపసంహరించుకోవడానికి 26వ తేదీ తుది గడువు. వచ్చేనెల 14వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే నెల 17వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. 22వ తేదీ నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది.
Recommended Video
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు మార్చి 29వ తేదీ నాటికి ఖాళీ కానున్నాయి. తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి నియోజకవర్గానికి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున రాము సూర్యారావు, కృష్ణా-గుంటూరు స్థానానికి ఏఎస్ రామకృష్ ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. వారిద్దరి ఎమ్మెల్సీ కాల పరిమితి మార్చిలో ముగియబోతోంది. దీనితో ఈ రెండు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ వెలువడింది.
తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు రాబోతోన్నాయి. కాంగ్రెస్ తరఫున నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి చిన్నారెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.