సస్పెన్స్: షర్మిలపై జగన్ డైలమా, టిలో 45 స్థానాల్లోనే..
హైదరాబాద్/విశాఖ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పోటీ, బాధ్యతలపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జగన్ సీమాంధ్రకు పరిమితమై, షర్మిలకు తెలంగాణ ప్రాంత బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను విశాఖ నుండి పోటీ చేయించాలని స్థానిక పార్టీ నాయకులు, క్యాడర్ జగన్పై ఒత్తిడి తెస్తోందట.
దీంతో జగన్ డైలమాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. షర్మిల విశాఖ లోకసభ స్థానం నుండి పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుందని స్థానిక నేతలు పార్టీ అధిష్టానానికి చెబుతున్నారట. అయితే, షర్మిల పోటీ విషయమై జగన్ ఈ నెల 28న తర్వాతనే పెదవి విప్పనున్నారంటున్నారు.
తెలంగాణలో ఇక్కట్లు
మరోవైపు తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి కనబడుతోంది. విభజన నిర్ణయం సమయంలో జగన్ సమైక్యవాదం బలంగా వినిపించారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని అంటున్నారు.
షర్మిల లేదా విజయమ్మలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించి, వారిని ఇక్కడి నుండి పోటీ చేయిస్తే కొంత లబ్ధి చేకూరవచ్చని ఆ పార్టీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయమై తెలంగాణ ప్రాంత నేతలు జగన్ పైన ఒత్తిడి తెస్తున్నారట. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎంతో కష్టం మీద దొరికారట.
విభజన నిర్ణయం అనంతరం కూడా ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం కొంత కనిపిస్తోంది. ఖమ్మంలో మరింత ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే షర్మిలను మల్కాజిగిరి లేదా ఖమ్మం బరిలో దించాలని ఆ పార్టీ ఓ సమయంలో యోచించింది. దక్షిణ తెలంగాణ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలని పార్టీ అధిష్టానం స్థానిక నేతలకు సూచించిందట.