కరెంట్ తీగలపై కష్టజీవి బలి:విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఇది...
ధర్మవరం, ఫిబ్రవరి 5: అధికారులు అంత కరుడుకట్టి పోయారా?...సామాన్యుల ప్రాణాలంటే వారికి అసలు లెక్క లేకుండా పోయాయా?...తమ నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు తీస్తున్నా ఏమీ పట్టనట్లు ఎలా ఉండగలుగుతున్నారు?...విద్యుత్ శాఖ సిబ్బంది కారణంగా కష్టజీవి అయిన ఓ యువకుడు బలైన తీరును చూసిన వాళ్లందరిలో ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా దాదులూరులో ట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక నిండుప్రాణం గాల్లో కలిసిపోయిన విధానం గుండెలను మెలిపెట్టింది.
అనంతపురం జిల్లాలో...విద్యుత్ శాఖలో దినసరి వేతనంపై పనిచేస్తున్న ఈ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విధానం చూస్తే మనుషుల ప్రాణాలంటే అధికారులకు ఎంత చులకనో కళ్లకు కట్టినట్లు అర్థం అవుతోంది. పైగా యువకుడి ప్రాణం పోయిన తరువాత కూడా ఆ విషయమై వారు స్పందించిన తీరు మానవత్వంపైనే నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. వ్యవస్థలో పేరుకు పోతున్న నిర్లక్ష్యం...అలక్ష్యం తో సామాన్యులు పిట్టల్లా రాలిపోవడం సమాజం పయనిస్తున్నతీరుకు అద్దం పడుతోంది.
విద్యుత్ షాక్ తో...యువకుడు మృతి...
వివరాల్లోకి వెళితే...ట్రాన్స్కోలో దినసరి కూలీగా పనిచేస్తున్నధనుంజయ(26) అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని దాదులూరు సమీపంలో మరమ్మత్తుకు గురైన ట్రాన్స్ఫార్మర్ ను రిపేర్ చేసేందుకు పోల్ పైకి ఎక్కాడు. స్థంభంపైకి ఎక్కి రిపేర్ చేస్తుండగా, ఒక్కసారిగా తీగల్లో కరెంటు సరఫరా కావడంతో హై ఓల్టేజ్ షాక్ కు గురై అక్కడికట్టడే మృతిచెందాడు.
విద్యుత్ శాఖలో...నిర్లక్ష్యానికి...నిలువెత్తు నిదర్శనం...
నిజానికి ఈ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల పని లైన్మ్యాన్ చేయాలి...ఆ పనులను సబ్స్టేషన్ నుంచి ఒక అధికారి పర్యవేక్షించాలి...అయితే ఇవన్నీ నిబంధనలు మాత్రమే...రూల్స్ బుక్ లో ఉంటాయంతే...అనుకున్నారో ఏమో...అధికారులు...వీటిలో ఏ ఒక్క నిబంధన పాటించలేదు...ఫలితం...అమాయక యువకుడి బలి...
అడుగడుగునా...నిర్లక్ష్యం...
ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ ను లైన్ మెన్ కు బదులుగా దినకూలీతో చేయించబోయారు. అంతేకాదు సబ్స్టేషన్లో అధికారి పర్యవేక్షించాల్సిన చోట ఓ వృద్ధుడిని కూర్బోబెట్టారు. ధనుంజయ రిపేరు కోసం ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కేముందు...సబ్స్టేషన్కు లైన్ చెక్ సమాచారం కూడా ఇచ్చాడు. అయితే సబ్స్టేషన్లో ఆ సమయంలో భాషా అనే అధికారి విధుల్లో ఉండాలి. అయితే, ఆయన బయటకు పోతూ నర్సయ్య అనే ఓ వృద్ధుడిని సబ్స్టేషన్లో ఉంచి వెళ్లిపోయారు. ఆ నర్సయ్య ఆ సమయంలో బాగా తాగి ఉన్నట్లు చెబుతున్నారు. ఆ మత్తులో ధనుంజయ ఇచ్చిన సమాచారాన్నినర్సయ్య పట్టించుకోలేదని తెలుస్తోంది.
ప్రాణం పోయినా...అదే నిర్లక్ష్యం...ఇంత అమానుషమా?...
నర్సయ్య కు అసలు అక్కడ వ్యక్తి రిపేరు చేస్తున్న విషయం తెలుసో...లేక లైన్ చెక్ మీద అవగాహన లేకో ఏమో ఒక్కసారిగా ఎల్సీ ఎత్తి వేయడంతో... వెంటనే తీగల్లోకి కరెంటు సరఫరా అయింది. ఆ వెంటనే, తీగలపైనే ధనుంజయ భయంకర విద్యుత్ షాక్ కు గురవడం...అక్కడే ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరిగిపోయాయి. ఇంతజరిగినా ట్రాన్స్కో అధికారుల్లో ఏమాత్రం స్పందన లేదని, కనీసం సంఘటనా స్థలాన్నీ కూడా సందర్శించలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పైగా ఇదే విషయమై తనను కలిసి ప్రశ్నించిన మీడియాకు, ట్రాన్స్కో ఏఈ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది.
గుండెల్నిపిండేసే...హృదయ విదారక దృశ్యం...
విద్యుత్ షాక్ కు గురై కరెంట్ స్థంభం మీదే ప్రాణాలు కోల్పోయిన ధనుంజయని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అతడి సమీప బంధువు పోల్ మీదే ప్రాణాలు కోల్పోయిన ధనుంజయని పట్టుకొని రోదించిన తీరు చూసే వాళ్ల హృదయాలని కలచివేసింది...ఇలా కరెంట్ షాక్ తో పోల్ మీదే చనిపోవడం, అక్కడ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో చాలా జరగడం విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్నితేటతెల్లం చేస్తోంది....సృష్టిలో అతి విలువైన మనిషి ప్రాణం పట్ల...తిరిగి రప్పించలేని జీవం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి ఘోరమో...అలా ప్రవర్తించేవారికి అర్థమయ్యేలా చెప్పడం ఎలా?...అనే ప్రశ్నకు సమాధానం వెదకాల్సిన తరుణం ఇది...