ఏపీలో దంచికొడుతున్న ఎండలు
వానలు దంచి కొట్టాల్సిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు సమీపంలోకి వచ్చిన నైరుతి రుతుపవనాలు అక్కడే స్థిరపడ్డాయి. బిపర్ జాయ్ తుపానే దీనికి కారణం. మరో రెండురోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఏపీలోని ప్రజలు విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తున్నారు. వడగాలులు తీవ్రంగా వీస్తుండటంతో ఉదయం 11.00 గంటల తర్వాత రోడ్లపై జనసంచారం ఉండటంలేదు.
ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్తు వినియోగం ఆల్ టైం రికార్డుస్థాయికి చేరుకుంటోంది. శుక్రవారం ఒక్కరోజే 263 మిలియన్ యూనిట్లు వినియోగం నమోదైంది. గత 8 సంవత్సరాల కాలంలో ఇదే అత్యధిక వినియోగమని అధికారులు వెల్లడించారు. మరో వారంరోజులపాటు విద్యుత్తు వినియోగం ఇదేస్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గత ఏడాదికన్నా ఈ ఏడాది 28 శాతం అధికంగా విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. 12,738 మెగావాట్లకి డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోతలు లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. రూ.14.50 కోట్ల ఖర్చుతో 22 మిలియన్ యూనిట్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వినియోగదారులకు విద్యుత్తు బిల్లులు భారీగా వస్తుండటంపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. డిమాండ్ పెరుగుతుండటంతో డిస్కంలు బహిరంగ మార్కెట్ లో విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాయి. నష్టాన్ని పూడ్చుకునేందుకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రతినెలా కరెంటు బిల్లులో వసూలు చేస్తున్నారు. మరో వారం రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. వారం రోజులు వడగాలులు వీస్తాయని ఒక ప్రకటనలో, రెండురోజుల్లో వర్షాలు కురుస్తాయని మరో ప్రకటనలో వాతావరణశాఖ చెబుతుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.












Click it and Unblock the Notifications