కర్నూలు: ఎమ్మిగనూరు, నంద్యాలలో ఈడీ అధికారుల సోదాలు, స్వల్ప ఉద్రిక్తత
కర్నూలు: జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. నంద్యాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పలు చోట్ల ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థల మద్దతుదారుల ఇళ్లల్లో ఒకేసారి ఐదు చోట్ల సోదారులు చేసినట్లు తెలిసింది.
ఎమ్మిగనూరు, నంద్యాల మండలంలోని కానాల, అయ్యలూరు గ్రామాలతోపాటు వన్ టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరిపేట, సరస్వతి నగర్లలో ఆకస్మిక సోదాలు చేశారు. కానాల గ్రామంలో ఈడీ అధికారులు, స్పెషల్ పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. గంటలకొద్ది సోదాలు నిర్వహించడంతో కొందరు ఎస్డీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నంద్యాల ఉప్పరిపేటలో ఎస్ డీపీఐ మద్దతుదారుడు అల్లాబక్ష్ ఇంట్లో ఈడీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. అల్లాబక్ష్ సెల్ఫోన్ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీంతో ఈడీ అధికారులను ఎస్ డీపీఐ మద్దతుదారులు నిలదీశారు. ఎందుకు సోదాలు చేస్తున్నారో చెప్పకుండా ఈడీ అధికారులు వెళ్లిపోతుండటంతో ఎస్ డీపీఐ మద్దతుదారులు వారిన అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Recommended Video
కాగా, ఎస్డీపీఐ తరపున ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారికి డబ్బులు వచ్చినట్లు, దానిపై ఈడీ అధికారులు స్పై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. వీళ్లంతా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించినట్లు సమాచారం. నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.