ఎగ్ దోశ తినేందుకు అమ్మ డబ్బులు ఇవ్వలేదని.. ఇంజనీరింగ్ విద్యార్ధి సూసైడ్ ; ఏపీలో ఘటన
చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపం చెందిన యువత అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. నవమాసాలు మోసి కని అల్లారుముద్దుగా పెంచిన తల్లిని, ఎన్నో ఆశలతో వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన తండ్రిని, సోదరులను, స్నేహితులను, బంధువులను అందరిని మరిచి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న తీరు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.
చిన్న కారణాలకే మనస్తాపం .. తనువు చాలిస్తున్న యువత
అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, తినడానికి డబ్బులు ఇవ్వలేదని, లేదా సినిమాకి వెళ్లొద్దు అన్నారని ఇలా అతి చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. బలహీనంగా మారుతున్న యువత మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. ఇక తాజాగా చిత్తూరు జిల్లా తలారి వారి పల్లెలో ఓ యువకుడు చిన్న కారణానికే ఆత్మహత్య చేసుకోగా, తల్లికి తీరని శోకం మిగిలింది. పాకాల మండలం తలారివారి పల్లెకు చెందిన సాయికిరణ్ అనే విద్యార్థి కేవలం అమ్మ ను ఎగ్ దోశ తినేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఎగ్ దోశ కావాలన్న కొడుకును మందలించిన తల్లి
సాయి కిరణ్ ఇంజనీరింగ్ స్టూడెంట్, అతను ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయికిరణ్ తండ్రి రమణయ్య మరణించిన తర్వాత తల్లి అన్నీ అయ్యి కొడుకును పెంచుకుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా కొడుకు బాగా చదువుకోవాలని ఆశించింది. ఈ క్రమంలోనే సాయికిరణ్ ను ఇంజనీరింగ్ చదివిస్తోంది. అయితే మంగళవారం ఉదయం సాయి కిరణ్ తనకు ఎగ్ దోస తినాలనిపిస్తుంది అని తల్లి దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగాడు. ఇంట్లో అన్నం, కూర వండానని, డబ్బులు వృధా ఖర్చు చేయవద్దని తల్లి సాయి కిరణ్ పై కోపగించుకుంది. కాస్త గట్టిగా చెప్పింది.
మనస్తాపం చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి .. ఆత్మహత్య
దీంతో మనస్తాపం చెందిన సాయి కిరణ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. ఎవరైనా స్నేహితులను కలవడానికి వెళ్ళాడేమో అని భావించిన తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి షాక్ తింది. ఇరంగారి పల్లె దగ్గరలోని గుర్రప్ప కుంటలో దూకి సాయి కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళుతున్న రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. సాయి కిరణ్ గా గుర్తించి తల్లికి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కన్నీరు మున్నీరైన తల్లి ... ఇంత చిన్న విషయానికే చనిపోయేంత అంత పెద్ద నిర్ణయమా ?
చేతికొచ్చిన చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో జీర్ణించుకోలేని సాయి కిరణ్ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. కేవలం ఎగ్ దోస అడిగితే వద్దని మందలించినందుకు ఇంత పని చేస్తావా అంటూ ఆ తల్లి రోదించిన తీరు గ్రామస్తులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. చిన్న విషయానికే సాయి కిరణ్ తీసుకున్న నిర్ణయం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఇక ఈ ఘటనతో పిల్లలను మందలించాలన్నా, ఎప్పుడు ఏం చేసుకుంటారో అన్న ఆందోళన తల్లిదండ్రులకు కలుగుతుందని స్థానికులు అంటున్నారు. చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురి కావడం, ప్రాణాలు తీసుకునేంతగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. బ్రతికి సాధించాలి కానీ, చనిపోయాక ఏం సాధిస్తారు అంటూ నిట్టూరుస్తున్నారు.












Click it and Unblock the Notifications