మూడు నెలల్లో 43 ఆవులు చనిపోయాయి - టీటీడీ ఈవో..!!
Tirumala: తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై వివాదం కొనసాగుతోంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. గోశాలలో ఆవులు మరణిస్తున్న పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఈ ఆరోపణలతో పాటుగా గోశాల నిర్వహణ.. గత మూడు నెలల కాలంలో చనిపోయిన ఆవుల లెక్కలను టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. 2024-24 మధ్య కాలంలో టీటీడీ గోశాలలో అనేక అవకతవకలు జరిగాయని ..వీటి పైన విజిలెన్స్ నివేదికలు కూడా ఉన్నాయని వివరించారు.
ఇవీ వాస్తవాలు
ఆవుల మృతి వివాదం పై ఈవో శ్యామల రావు స్పందించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని, 2023లో విజిలెన్స్ అధికారులను గోశాలకు అనుమతించలేదన్నారు. గోశాలలో అక్రమాలు బయటపెడతారని భయంతో విజిలెన్స్ అధికారులను రానివ్వలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకర్రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారు. మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయాయని తెలిపారని, అసత్యాలు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని అన్నారు.

సగటున నెలకు
సగటున నెలకు 15 ఆవులు చనిపోతాయని, గడిచిన మూడు నెలల్లో 43 ఆవులు చనిపోయాయ ని వెల్లడించారు. దాతల నుంచి తీసుకున్న ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని, మృతి చెందిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో గోవులు తాగే నీళ్లు కూడా నాచు పట్టేసినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుతం గతంలో జరిగిన తప్పులన్నింటిని ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని, దళారులపై పోలీసు, విజిలెన్స్ విభాగం నుంచి చర్యలు తీసుకున్నామన్నారు. ఆవు నెయ్యి కల్తీ విషయం అందరికీ తెలిసిందేనని, ఏఆర్ డెయిరీని బ్లాక్లిస్టులో పెట్టామని చెప్పారు.
పూర్తి ప్రక్షాళన
పది నెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరిచామని తెలిపారు. టీటీడీ ఐటీ విభాగంలో ఉన్నతస్థాయి అధికారి నియామకంలో నిబంధన గాలికొదిలేశారని, జీఎం స్థాయి అధికారి నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఐటీ విభాగం వైఫల్యంతో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక దళారి 50 సార్లు ఆర్జిత సేవలు టికెట్ పొందారని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications