కెసిఆర్ను ఏకిపారేసిన ఎర్రబెల్లి: మోత్కుపల్లి అసంతృప్తి?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సమయంలో ఎర్రబెల్లి శాసన సభలో కెసిఆర్ను ఏకి పారేశారు. ఆస్తుల అంశం చర్చకు వచ్చినప్పుడు ఎర్రబెల్లి తెరాస శాసన సభ్యులకు సవాల్ చేశారు.
తన ఆస్తుల పైన, కెసిఆర్ ఆస్తుల పైన తాను బహిరంగ చర్చకు సిద్దమన్నారు. మొదటి నుంచి తమ కుటుంబం కోటీశ్వరులమేనని, ఇప్పుడు కెసిఆర్ ధనవంతుడో.. నేను ధనవంతుడినో తేల్చుకుందామని అన్నారు. కెసిఆర్ శవ రాజకీయాలు చేశారని, తెలంగాణ సెంటిమెంటుతో సంపాదించారని ఆరోపించారు. తాను పుట్టుకతోనే ధనవంతుడిని అన్నారు.
తాను డీలర్ను కాకపోయినప్పటికి జిల్లా డీలర్లంతా కలిసి తనను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పారు. తన తండ్రి భూస్వామి అని, భూదానం చేసిన వ్యక్తి అన్నారు. కానీ, ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యల పైన తెరాస శాసన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి చుట్టుముట్టారు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి శాసన సభను శనివారానికి వాయిదా వేశారు.
మోత్కుపల్లి అసంతృప్తి?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అసంతృప్తితో ఉన్నారా? అంటే కావొచ్చుననే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు పార్టీలో రాజ్యసభ గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. టిడిపిలోను రాజ్యసభ అసంతృప్తులు క్రమంగా బయటపడుతున్నారంటున్నారు. మోత్కుపల్లి రాజ్యసభ సీటును ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధినేత నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే దీనిని తెలుగు తమ్ముళ్లు కొట్టి పారేస్తున్నారు.