కడియంVsరాజయ్య: ఇబ్రహీం వార్నింగ్, ఎర్రబెల్లికి నో
వరంగల్/మహబూబ్ నగర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల్లో విభేదాలు రాజుకుంటున్నాయి. వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితికి చిక్కులు వచ్చి పడుతున్నాయి. వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కోసం కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య విభేదాలు తలెత్తాయి.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కడియం శ్రీహరికి ఇవ్వాలని ఆయన వర్గం కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఆయన కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీ నుండి తెరాసలోకి వచ్చారు. ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా రాజయ్య ఉన్నారు. నియోజకవర్గం కోసం ఇరు వర్గాలు పట్టుబపడుతున్నాయి. మంగళవారం జఫర్ గడ్ మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది.

రాజయ్యను వరంగల్ లోకసభ స్థానానికి పంపాలని కడియం అనుచరులు తీర్మానం చేయగా, ఘనపూర్ సీటును వదలొద్దని అటు రాజయ్య అనుచరులు పట్టుబడుతున్నారు. చివరికి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రానును కలవాలని ఇద్దరు నేతల అనుచరులు నిర్ణయించారు.
పాలమూరులో...
పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ అసెంబ్లీ ఇంఛార్జిగా టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ను నియమించడంపై మైనార్టీ నేత, గత ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఇబ్రహీం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంట మైనార్టీలకు అన్యాయం చేసినట్లేనని, ఆ ప్రభావం పార్టీపై పడుతుందన్నారు. తాను ఎమ్మెల్సీ కావడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. శ్రీనివాస్ గౌడ్కు ప్రజల మద్దతు లేదని, పార్టీ శ్రేయస్సు కోసం తనకు టిక్కెట్ ఇవ్వాలన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందన్నారు.
ఎర్రబెల్లికి వ్యతిరేకంగా తీర్మానం
వరంగల్ జిల్లాలో టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. ఎర్రబెల్లిని పార్టీలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆయనను పార్టీలోకి తీసుకుంటే ఓడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications