ఆంధ్ర పార్టీలు కుట్రలు మానలేదు: విపక్షాలపై ఈటెల
హైదరాబాద్: రైతుల రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఏడాది కాలపరిమితి విధిస్తూ లక్ష రూపాయల రైతు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ఈటెల రాజేందర్ చేసిన ప్రకటనపై కాంగ్రెసు, తదితర ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. రైతులను రుణమాఫీపై రెచ్చగొట్టవద్దని ఆయన ప్రతిపక్,ాలకు సలహా ఇచ్చారు. రాష్ట్రం విడిపోయినా ఆంధ్ర పార్టీలు కుట్రలు మానలేదని, తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీలకు ప్రశాంతత ఇష్టం లేదని ఆయన విమర్శించారు.
రైతుల రుణమాఫీపై ప్రతిపక్షాలు అయోమయానికి గురి చేస్తున్నాయని, తాము స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రుణమాఫీని తాము ఎన్నికల కోసం ప్రకటించలేదని, రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు రుణమాఫీకి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

లక్ష రూపాయల పంటరుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ఓ రైతు ఐదు లక్షల రూపాయల రుణం తీసుకుంటే ప్రభుత్వం లక్ష రూపాయలు చెల్లిస్తుందని, మిగతాది రైతు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పంటరుణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని తాము బ్యాంకర్లను కోరినట్లు ఆయన తెలిపారు.
రైతుల రుణమాఫీకి కాలపరిమితిపై నిర్ణయం తీసుకోలేదని, మరో పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఈటెల చెప్పారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications