అడ్డొస్తే ఖబడ్దార్, ఛీకొడుతున్నా కావాలా: కిరణ్పై ఈటెల
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణకు అడ్డుపడితే ఖబడ్దార్ అని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రులు చిరంజీవి తదితరులను హెచ్చరించారు. తెలంగాణ తమ అరవయ్యేళ్ల కల అని అది ఏర్పడుతున్న సమయంలో మళ్లీ అడ్డుపడితే ఊరుకునేది లేదన్నారు. కొందరు సీమాంధ్ర నేతలు తాత జాగీర్లా లక్షలాది ఎకరాలను కబ్జా చేశారని ధ్వజమెత్తారు.
వెయ్యి మంది బిడ్డలను పోగొట్టుకొని తాము పుట్టెడు దుఃఖంలో ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తుంటే తెలంగాణ కాంగ్రెసు నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్ర దోపిడీ అంతం కావాలనే తాము యాభై ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. మళ్లీ ఆంక్షలు అంటే ఎలా అన్నారు.
కుట్రతో హెచ్ఎండిఏ పరిధిని ముఖ్యమంత్రులు విస్తరించారని ఆరోపించారు. కిరణ్, చిరంజీవి, పురంధేశ్వరి.. ఇలా అందరూ హైదరాబాదును యూటి చేయాలని, ఉమ్మడి రాజధానిగా శాశ్వతంగా చేయాలని నివేదికలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కబ్జా చేసిన భూమిని చట్టబద్దం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు.
తెలంగాణలో అక్రమంగా ఉద్యోగం సంపాదించిన వారు వెళ్లిపోవాల్సిందే అన్నారు. ఖబడ్దార్ ఇక నుండి ఎవరి కుట్రలు సాగనివ్వమన్నారు. ముఖ్యమంత్రి హెచ్ఎండిఏలో మీటింగ్ ఎలా పెట్టారని, అదేమైనా ఆయన తాత జాగీరా, ఆయన అబ్బ సొత్తా అని ధ్వజమెత్తారు. కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రి అన్నారు.
కిరణ్కు చీము, నెత్తురూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆ కుర్చీలో కూర్చోవద్దన్నారు. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఛీకొడుతుంటే ఇంకా పట్టుకొని వేలాడటం ఏమిటన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ వచ్చే వరకు తాము పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు జీవచ్చవాల్లా ఉండవద్దన్నారు.