సీన్ రివర్స్: శిల్పా చేరికతో చిక్కుల్లో జగన్, నంద్యాల సీటుపై పీటముడి
ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థి ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, ఇప్పుడేమో వైసీపీలో అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశమైంది.
కర్నూలు: ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థి ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, ఇప్పుడేమో వైసీపీలో అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశమైంది.
ఎందుకంటే, వైసీపీలో నిన్నటి వరకు నంద్యాల టిక్కెట్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే. ఇప్పుడేమో శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి బయటికొచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన టీడీపీ నుంచి బయటికి రావడానికి కూడా కారణం నంద్యాల టీడీపీ టిక్కెట్ దక్కకపోవడమే.
నిన్నటి వరకు ఆయనదే... కానీ...
ఇప్పుడు జగన్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది వైసీపీలో మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే, ‘నంద్యాల టిక్కెట్ నాదే.. నాకు జగన్ మాటిచ్చారు..' అంటూ ఇప్పటికే ఆ పార్టీ నంద్యాల ఇన్ ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల వైసీపీ ప్లీనరీలోనూ మల్కిరెడ్డే మా అభ్యర్థి అంటూ వైసీపీ నీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా తేల్చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ టిక్కెట్ మల్కిరెడ్డి రాగోపాల్ రెడ్డిదే అని నిన్నటి వరకు అందరూ భావించినా.. తాజా రాజకీయ పరిణామంతో ఆయనకు టిక్కెట్ దక్కుతుందా? అనే సందేహం మొదలైంది.
పైగా వీర విధేయుడు కూడా...
మల్కిరెడ్డి రాజగోపాల్రెడ్డి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి స్వయాన మేనల్లుడు. వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ఎస్పీవై రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరినా మల్కిరెడ్డి మాత్రం అందులోనే కొనసాగుతున్నారు. ఆనాటి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కలిసి పని చేశారు. 2016 జనవరిలో ఎమ్మెల్యే భూమా టీడీపీలో చేరినా మల్కిరెడ్డి మాత్రం వైసీపీని వీడలేదు. ఆయన విధేయత గుర్తించిన జగన్ ఆయనకు నంద్యాల నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ తనకేనంటూ ఆయన ప్రకటించుకుంటున్నారు.
శిల్పా మోహన్ రెడ్డి చేరికతో తారుమారు...
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీలో ఇటు భూమా, అటు శిల్పా వర్గాల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. మంత్రి అఖిల ప్రియ, శిల్పా మోహన్ రెడ్డి ఇద్దరూ టిక్కెట్ తమ వర్గానికి ఇవ్వాలంటూ పట్టుదలలకు పోవడం ఏకంగా సీఎం చంద్రబాబునే ఇరకాటంలో పెట్టింది. ఈ విషయంలోనే అలక వహించిన శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పేందుకే నిశ్చయించుకుని వైసీపీ అధినేత జగన్ తో మంతనాలు సాగించారు. నంద్యాల టిక్కెట్ విషయంలో ఆయన హామీ ఇవ్వడంతోనే బుధవారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కూడా నంద్యాల ఉప ఎన్నికలో శిల్పాను బరిలో దింపేందుకే నిర్ణయించుకున్నారని, ఇప్పటికే వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, శిల్పా వర్గం ఓట్లు తోడైతే ఆ స్థానం కచ్చితంగా వైసీపీకి దక్కుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం.
ఇరుకున పడిన వైసీపీ అధినేత...
మరి జగన్ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో దింపి శిల్పా మోహన్ రెడ్డిని బుజ్జగిస్తారా? లేక రాజగోపల్ రెడ్డినే బుజ్జగించి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలుపుతారా? అనేది తాజాగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ఉప ఎన్నికైనా, 2019 సాధారణ ఎన్నికలైనా నంద్యాల సీటు శిల్పాకే అంటూ ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుండగా.. మరోవైపు మరి ఇన్నాళ్లూ పార్టీని, పార్టీ అధినేత జగన్ ను నమ్ముకుని ఉన్న రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏమిటని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.
ఆది నుంచీ వ్యతిరేకతే...
2014 ఎన్నికలకు ముందు శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండేవారు. ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత రెండేళ్లకు అంటే.. 2016 జనవరిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అప్పటికే టీడీపీలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి భూమా వర్గం చేరికను వ్యతిరేకించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే చంద్రబాబు శిల్పాను బుజ్జగించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి నంద్యాల జిల్లాలో మరో నాలుగు స్థానాలు వస్తాయని, పోటీ పడకుండా కలిసి పనిచేయాలని సూచించారు.
మెత్తబడినట్లు కనిపించినా..
హఠాత్తుగా మార్చి 12న భూమీ నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయం ప్రకారం భూమా కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ టీడీపీ అధినేత చంద్రబాబుకు నివేదించారు. అయితే 2014 నాటి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ తనకే దక్కిందని, ఇప్పుడు కూడా తనకే ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి డిమాండ్ చేయడంతో చంద్రబాబు ఇరు వర్గాలను వేర్వేరుగా తన నివాసానికి పిలిపించి చర్చించారు. చంద్రబాబు బుజ్జగింపులతో ఇరు వర్గాల నడుమ శత్రుత్వం కాస్త సద్దుమణిగినట్టు కనిపించినప్పటికీ.. తీవ్ర అసంతృప్తికి గురైన శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది.
అక్కడ సమసింది.. ఇక్కడ మొదలైంది.
నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శిల్పా మోహన్ రెడ్డిని పిలిచి నచ్చజెప్పిన నేపథ్యంలో.. ఇక టీడీపీ అభ్యర్థిత్వం భూమా బ్రహ్మానందరెడ్డి కి దక్కుతుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో నంద్యాల టిక్కెట్ ఇక కచ్చితంగా భూమా బ్రహ్మానందరెడ్డికే దక్కుతుందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ‘సీఎం చంద్రబాబు నాన్చుడు ధోరణి కారణంగానే నే పార్టీ మారానే తప్ప టిక్కెట్ ఆశించి కాదు.. వైసీపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా.. ' అని శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నప్పటికీ.. ఒక రకంగా ఈ పరిణామం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేదే. టీడీపీలో మొదలైన టిక్కెట్ గొడవ అక్కడ సమసి, ఇప్పుడు వైసీపీలో మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. రాజగోపాల్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.