జగన్, హరీష్ హోటల్ భేటీపై ఆధారాలు బయపెడ్తాం: అచ్చెన్నాయుడు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్ హోటల్లో మే 21న కలుసుకున్న మాట వాస్తవమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి చెప్పారు. హోటల్లో సీసీ ఫుటేజీని డిలిట్ చేయించారని ఆయన ఆరోపించారు.
ఆ ముగ్గురు కలుసుకున్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు బయటపెట్టాలో అప్పుడు బయటపెడతామని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఈ గతి పట్టడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమేనని ఆయన విమర్శించారు. జగన్ దీక్షకు మేం కూడా కౌంటర్గా దీక్ష చేయాలని, లేదంటే లైట్ తీసుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు.

హరీష్ రావు, జగన్, స్టీఫెన్సన్ హోటల్లో కలుసుకుని నోటుకు ఓటు కేసుకు కుట్ర చేశారని అచ్చెన్నాయుడు మంగళవారం శాసనసభలో ఆరోపించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అదే విషయాన్ని శాసనసభలో చెప్పారు.
తాను హరీష్ రావును హోటల్లో కలుసుకున్నట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని, రుజువు చేయలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ శాసనసభలో సవాల్ విసిరారు. చాలెంజ్ అంటూ చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు ఆరోపణపై తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా మండిపడ్డారు. రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు చంద్రబాబుకు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications