ఎవరికిస్తారో చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు!!
సోము వీర్రాజు మరోసారి భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో కన్నా జనసేనలో చేరడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. సత్తెనపల్లి నుంచి పోటీచేస్తారని వార్తలు వస్తున్నాయి.
భారతీయ జనతాపార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొన్ని సంవత్సరాల తర్వాత తనలోని రాజకీయ చతురతను బయటకు తీస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీలో ఉన్న సీనియర్లు కొందరు పార్టీలు మారడం, మరికొందరు సైలెంటవడం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరాలనుకున్నప్పటికీ అనివార్య కారణాలతో భారతీయ జనతాపార్టీలో చేరాల్సి వచ్చింది. మీ లాంటి సీనియర్లు కావాలంటూ బీజేపీ అధిష్టానం ఒత్తిడి చేయడంతో ఆయన కూడా కమలం గూటికి చేరారు.

పదవీకాలాన్ని పొడిగించలేదు..
ఢిల్లీ అధినాయకత్వం కూడా కన్నాను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చేసింది. పదవీ కాలం పూర్తయిన తర్వాత పొడిగించకుండా తిరిగి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది. తాజాగా భీమవరంలో ముగిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూడా ఎన్నికల వరకు సోమునే అధ్యక్షుడిగా పేర్కొంటూ తీర్మానం చేశారు. కార్యవర్గ సమావేశాలకు హాజరు కాకుండా కన్నా హైదరాబాద్ లో ఉన్నారు. దీనిద్వారా బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోము వీర్రాజుకే పగ్గాలు అప్పజెబుతారా? లేదంటే మరెవరినైనా ఎన్నుకుంటారా? అనే విషయంపై స్పష్టత కోసమే కన్నా వేచిచూశారంటున్నారు.

కన్నా నియమించినవారిని తొలగించిన సోము
సోము వీర్రాజే ఖాయమవడంతో దాదాపుగా కన్నా పార్టీ మారడం ఖాయమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీజేపీకన్నా సోము వీర్రాజు అంటేనే కన్నా ఎక్కువగా మండిపడుతున్నారు. కన్నా హయాంలో నియమితులైన జిల్లాల పార్టీ అధ్యక్షులను, అనుబంధ విభాగాల్లో నియమితులైనవారందరినీ సోము అధ్యక్షుడవగానే తొలగించారు. దీనిపై కన్నా సోముపై నిప్పులు చెరిగారు. అయితే ఢిల్లీ నుంచి పెద్దలు ఫోన్ చేసి నచ్చచెప్పడంతో నెమ్మదించారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కన్నాను గౌరవించకపోతే అందరం రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల వరకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజే అని ఖాయమవడంతో కన్నా జనసేనలో చేరడం దాదాపుగా ఖాయమైందంటున్నారు.

సత్తెనపల్లి నుంచి జనసేన తరఫున?
గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు నియోజకవర్గాల నుంచి గతంలో కన్నా ప్రాతినిధ్యం వహించారు. తాజాగా సత్తెనపల్లి నుంచి పోటీచేయాలనే యోచనలో కన్నా ఉన్నట్లు తెలుస్తోంది. కన్నాను కొద్దిరోజుల క్రితం నాదెండ్ల మనోహర్ కలిశారు. జనసేనలో చేరిన పక్షంలో సత్తెనపల్లిని కేటాయించే అవకాశం ఉందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుపై నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఇన్ ఛార్జిని కూడా నియమించలేదు. సామాజికవర్గాల పరంగా అన్ని లెక్కలు చూసుకుంటే సత్తెనపల్లి నుంచి జనసేన తరఫున కన్నా పోటీచేయడం, గెలవడం ఖాయమని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications