బీజేపీలోకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి - బంపరాఫర్ : పొత్తుల్లో కీలక పాత్ర..!?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కాషాయం కండువా కప్పుకోవటానికి రంగం సిద్దమైంది.
బీజేపీ కీలక నేతలపైన గురి పెట్టింది. ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల్లోనూ చేరికల పై పోకస్ చేసింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కాషాయం కండువా కప్పుకోవటానికి రంగం సిద్దమైంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన నల్లారి కుటుంబం ఇప్పుడు పూర్తిగా ఆ పార్టీకి దూరమైంది. నల్లారి కిషోర్ టీడీపీలో ఉండగా.. కిరణ్ బీజేపీలో చేరటానికి ముహూర్తం ఖరారైంది. వైసీపీకి రాజకీయ ప్రత్యర్ధి అయిన కిరణ్ ఇప్పుడు బీజేపీలో కీలక పదవి ఆఫర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ కు బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఎన్నికల వేళ పొత్తు రాజకీయాల్లో కిరణ్ కీలక పాత్ర తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. నల్లారి కుటుంబం కాంగ్రెస్ తో సుదీర్ఘ కాలం కొనసాగింది. 2010లో కిరణ్ ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం..జగన్ వ్యవహారం సెట్ చేసేందుకు అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కిరణ్ పైన నమ్మకం పెట్టుకుంది. జగన్ పైన కేసులు..ఆ తరువాతి పరిణామాల్లో కాంగ్రెస్ నిర్ణయాల వెనుక కిరణ్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపించారు. రాష్ట్ర విభజన సాధ్యం కాదని ..విభజన జరిగితే తెలంగాణ నష్ట పోతుందని వాదించారు. కానీ, విభజన పూర్తయింది. సీఎం పదవికి..కాంగ్రెస్ కు కిరణ్ రాజీనామా చేసారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేసారు. ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కానీ, పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు.

బీజేపీ నుంచి కీలక పదవిపై హామీ
కిరణ్ కుమార్ రెడ్డి తో కొద్ది రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు మంతనాలు సాగిస్తున్నారు. గతంలోనే కిరణ్ బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగినా అప్పట్లో ఖండించారు. కిరణ్ కు రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా మరో కీలక పదవి పై పార్టీ నాయకత్వం నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కిరణ్ సేవలు ఉపయోగపడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తెలంగాణలో కిరణ్ పైన ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ బీజేపీకి కిరణ్ సేవలు ఏ రకంగా ఉపయోగించుకుంటారనే చర్చ మొదలైంది. ఏపీలో ఇప్పుడు బీజేపీ ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిస్తే ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే దాని పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీ బీజేపీలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది.

జగన్- చంద్రబాబులో టార్గెట్ ఎవరు
చిత్తూరు జిల్లాలో తొలి నుంచి నల్లారి కుటుంబం టీడీపీకి వ్యతిరేకంగా పని చేసింది. సమైక్యాంధ్ర పార్టీ ద్వారా 2014లో టీడీపీకి కొంత లోపాయి కారీగా సహకారం అందించారనే విమర్శ ఉంది. అదే సమయంలో కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ టీడీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లొ పీలేరు నుంచి పోటీ చేయనున్నారు. ఇటు కిరణ్ బీజేపీలో చేరుతున్నారు. నాడు వైఎస్సార్ కు విధేయుడిగా ఉన్న కిరణ్ ఆ తరువాత జగన్ కు రాజకీయ ప్రత్యర్ధిగా మారారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరం ఉంది. ఈ సమయంలో బీజేపీ - వైసీపీ సంబంధాల్లో కిరణ్ పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. దీంతో పాటుగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు దిశగా చంద్రబాబు - పవన్ ప్రయత్నిస్తున్న వేళ.. బీజేపీలో చేరుతున్న జగన్ చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కిరణ్ రోల్ ఏంటనేది ఇప్పుడు చర్చకు కారణం అవుతోంది. ఇప్పుడు కిరణ్ బీజేపీలో ఎంట్రీ ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications