సీఎస్ ను తొలిగించిన విధానం సరిగా లేదు: ఆ విషయంలో ఇచ్చిన బహుమానమా: ఐవైఆర్ సంచలనం..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా సీఎస్ వ్యవహార శైలి పైన వస్తున్న అభ్యంతరాల కారణంగానే ఎల్వీ సుబ్రమణ్యం ను బదిలీ చేసారని అధికారుల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి నోటీసు ఇవ్వటం ద్వారా..ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్లుగా భావించినట్లు కనిపిస్తోందని సీనియర్ బ్యూరో క్రాట్లు విశ్లేషిస్తున్నారు. దీని కారణంగానే ముఖ్యమంత్రి ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎల్వీ సుబ్రమణ్యం పదవీ కాలం
వచ్చే ఏప్రిల్ తో ఎల్వీ సుబ్రమణ్యం పదవీ కాలం ముగియనుంది. సాధారణంగా ఇప్పటి వరకు ఎన్నికల సంఘం మినహా ఏ ప్రభుత్వంలోనూ విధుల్లో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసిన దాఖలాలు లేవు. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పైన మాజీ సీఎస్ .. ప్రస్తుత బీజేపీ నేత ఐవైఆర్ చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి.
ఆ విషయంలో ఇచ్చిన బహుమానమా..
మాజీ సీఎస్ ఐవైఆర్ ప్రభుత్వం ప్రస్తుత సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ చేయటం పైన వెంటనే స్పందించారు. ఆయన తన ట్వీట్ లో.. సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదని పేర్కొన్నారు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నదంటూ సీరియస్ కామెంట్ చేసారు. అదే సమయంలో ..హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం..అంటూ ఐవైఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తిరుమల తిరుపతితో పాటుగా హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు విధులు నిర్వహించకుండా నేరుగా సీఎస్ హోదాలో ఎల్వీ సుబ్రమణ్యం రంగంలోకి దిగారు. బీజేపీ నేతల విమర్శలకు సమాధానంగా పూర్తి ప్రక్షాళనకు నిర్ణయించారు. అదే కారణంగా అయితే, ఇప్పడు ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ బహుమానం అయితే మరీ దారుణం అంటూ కామెంట్ చేసారు.
చంద్రబాబు హాయంలో మొదలైంది..
ఇక, ఐవైఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలోని అధికారుల తీరు పైన అనేక మార్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. పలు అంశాల్లో అసలు సీఎస్ కు సంబంధం లేకుండా సీఎంఓ అధికారులే నిర్ణయాలు తీసుకొనే వారు. దీంతో..ఆయన పదవీ విరమణ చేసి..ఆ తరువాత బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా పని చేస్తూనే చంద్రబాబు తీరు పైన విమర్శలు చేసారు. దీంతో..ఆయన్న అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుండి తప్పించారు. ఆ తరువాత రాజధాని..స్విస్ చాలెంజ్ వంటి అనేక అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను ఓపెన్ గా తప్పుబట్టిన ఐవైఆర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇక, తాజాగా సీఎంఓ లో అధికారి అయిన ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ నోటీసు ఇవ్వటం పైనా ఆయన స్పందించారు. దీని పైన ట్వీట్ చేస్తూ.. ఇదేమీ కొత్తకాదు.ఈ జాడ్యం బాబు గారి హయాంలో మొదలై బలపడి ఇప్పుడు పరాకాష్ట చేరింది. ముఖ్యమంత్రి కార్యదర్శి జి.ఎ.డి సెక్రెటరీగా ఉన్న తర్వాత సి ఎస్ కు పాలనలో పట్టు ఉండటం కష్టం. అన్ని అధికారాలు ఎటువంటి బాధ్యత లేని సీఎంవో సక్రమ పాలనకు ఆటంకం. దీనిపై నా ప్రజా వాజ్యం హైకోర్టులో పెండింగ్...అంటూ ట్వీట్ చేసారు. ఇప్పుడు ఐవైఆర్ చేసిన ట్వీట్లు ఏరకంగా చర్చకు కారణమవుతాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.