TTD: గంటలో శ్రీవారి దర్శనం, టీటీడీ నిధుల వృథా - మాజీ ఈవో కీలక సూచనలు..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. భక్తులకు సౌకర్యాల పెంపు పైన టీటీడీ ఫోకస్ చేసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తుల క్యూ లైన్ మేనేజ్ మెంట్ ద్వారా శ్రీవారి దర్శనం వేగంగా అందుతోంది. దర్శనం విధానంలో ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం దిశగా కసరత్తు చేస్తోంది. కాగా, గంటలో శ్రీవారి దర్శనం కోసం చేస్తున్న ప్రయత్నాల పైన టీటీడీ మాజీ ఈవో.. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కీలక వ్యాఖ్యలు చేసారు.
మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. టీటీడీలో తీసుకొస్తున్న మార్పుల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేసారు. శ్రీవారి దర్శనం విషయంలో సాంకేతికత వినియోగం పైన ఎల్వీ స్పందించారు. సామాన్య భక్తులకు రెండు మూడు గంటల్లో దర్శనం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్రదర్శనం కష్టమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న విధానానికి మించి శ్రీవారి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదని తెలిపారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా చేయడం మంచిది కాదని హితవుపలికారు.

అమలు సాధ్యం కాని ఆలోచనలకు స్వస్తి పలకాలని టీటీడీకి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. దీనికి బదులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించాలని సూచించారు. ఇప్పటికే టీటీడీ అలిపిరి కేంద్రంగా బేస్ క్యాంపు ఏర్పాటు.. దర్శన విధానంలో ఏఐ వినియోగం పైన పలు సంస్థలలో సంప్రదింపులు చేసింది. ఏఐ వినియోగం ద్వారా భక్తులకు వేగంగా దర్శనం కల్పించటమే లక్ష్యమని చెబుతోంది. అయితే, ఇప్పుడు ఎల్వీ చేసిన వ్యాఖ్యల పైన టీటీడీ ముఖ్యులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఇక.. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,367 మంది దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications