తాజా మాజీ డిప్యూటీ సిఎం రాజయ్యకు గుండెపోటు
హైదరాబాద్: తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యకు గుండెపోటు వచ్చింది. ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవలే మంత్రివర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో రాజయ్యను కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని హైదర్గుడా అపోలో ఆస్పత్రి చేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజయ్యకు రక్తంపోటు (బిపి), షుగర్ లెవెల్స్ పెరిగాయి. రాజయ్యకు ఏ విధమైన ప్రమాదం లేదని ఆయన కుమారుడు క్రాంతి చెప్పారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ శాఖపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాజయ్యను కెసిఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు. రాజయ్య ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాజయ్యకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, నొప్పి రాగానే రాజయ్యను ఆస్పత్రికి తెచ్చారని వారు చెప్పారు. ఐసియూలో రాజయ్యకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గుండె వాల్వ్కు సంబంధించిన చిన్న సమస్య తలెత్తిందని వారు చెప్పారు.
రాజయ్యను అటు బర్తరఫ్ చేస్తూ ఇటు పార్లమెంటు సభ్యుడైన కడియం శ్రీహరి చేత కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయించి ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. శాఖల్లో మార్పులు కూడా చేశారు. మంత్రి పదవి పోవడంతో రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరప్ చేయడంతో రెండు రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
సోమవారం నుంచి చాతిలో నొప్పిగా ఉందని రాజయ్య తన కుటుంబ సభ్యులతో చెప్పారని, ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయనకు గుండె నొప్పి ఎక్కువడడంతో రాజయ్యను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రాజయ్యను 24 గంటల పాటు వైద్యులు తమ పర్యవేక్షణలో ఉంచనున్నారు.
తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని రాజయ్య ఏసుప్రభువు సాక్షిగా చెబుతున్నానని అన్న విషయం కూడా తెలిసిందే. కెసిఆర్ తనకు దైవసమానులని కూడా ఆయన అన్నారు.