వీడియో: ఏపీ సీఐడీ సోదాలు: అనారోగ్యానికి గురైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి: ఆసుపత్రిలో అడ్మిట్
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు దృష్టి సారించారు. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కే లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలను నిర్వహించారు. దీనికోసం ఏపీ సీఐడీ విభాగానికి చెందిన ప్రత్యేక అధికారుల బృందం హైదరాబాద్కు వెళ్లింది. ఆరుమంది అధికారులు ఈ బృందంలో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా ఈ సోదాల్లో పాల్గొన్నారు.
సోదాలను నిర్వహించడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో లక్ష్మీనారాయణ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో సీమెన్స్ ప్రాజెక్ట్కు సంబంధించిన క్లస్టర్లను మంజూరు చేసే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై జగన్ సర్కార్ విచారణకు ఆదేశించింది. దీన్ని ఏపీ సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు.
ఈ సోదాల తరువాత లక్ష్మీనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. తన ఇంట్లో అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు ప్రథమ చికిత్సను అందించారు. దీనితో ఆయన కోలుకున్నారు. అధిక రక్తపోటు, షుగర్ వల్ల కళ్లు తిరిగి ఆయన కిందపడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ ధృవీకరించడంతో జగన్ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ అవినీతి చోటు చేసుకున్న సమయంలో లక్ష్మీనారాయణ ఈ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారని సమాచారం. 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరు క్లస్టర్లకు అనుమతి ఇచ్చింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన క్లస్టర్లు ఇవి.
వీడియో: ఏపీ సీఐడీ సోదాలు: అనారోగ్యానికి గురైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి: ఆసుపత్రిలో అడ్మిట్#APSSDC pic.twitter.com/FhbNsURYFL
— oneindiatelugu (@oneindiatelugu) December 10, 2021
ఈ క్లస్టర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అయిదు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూటషన్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పాలనేది ప్రతిపాదనలు. ఒక్కో క్లస్టర్ విలువ 548,84,18,908 రూపాయలు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం. ఈ మేరకు సీమెన్స్ అండ్ డిజైన్ టెక్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ప్రభుత్వం. ఈ క్లస్టర్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 491,84,18,908 రూపాయలను కేటాయించింది.
ఇందులో ప్రభుత్వానికి చెందిన 10 శాతం వాటా విలువ 55 కోట్ల రూపాయలుగా నిర్దారించారు. అనంతరం ఈ సీమెన్స్తో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకుంది. దీని విలువ 370,78,80,000 రూపాయలు. ఇది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్గా నిర్ధారించింది. ఇది కార్యరూపం దాల్చలేదని, అయినప్పటికీ ప్రభుత్వం వాటాగా భావించిన 10 శాతం మొత్తాన్ని వినియోగించుకున్నట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. మొత్తంగా 241,78,61,508 రూపాయలు నెట్వర్క్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు నిర్ధారించింది.