ఈ మెయిళ్లు పంపింది ఆయనే, సింగపూర్ టూర్ లో జరిగిందిదీ..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన పైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతి సొమ్ము దాచుకొనేందుకే సింగపూర్ వెళ్లారని ఆరోపించారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైసీపీ ఈ మెయిల్స్ రాస్తోందంటూ లోకేష్ కట్టుకథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వ అవినీతిపై ఈ మెయిల్స్ రాసింది టీడీపీకి చెందిన వీరాభిమానేని బయటపడిందని అమర్నాధ్ చెప్పుకొచ్చారు.
పెట్టుబడులు తీసుకురావడానికి సింగపూర్ పర్యటనకి వెళ్తున్నట్టు చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తెచ్చారని అమర్నాధ్ ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక డైవర్ట్ చేసేందుకు రెండు రోజులుగా వైసీపీ పైన మంత్రి లోకేష్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలన చూసి, కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు.

జగన్ విదేశీ కంపెనీలకు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఈమెయిల్స్ రాయించాడంటూ లోకేష్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తీరా ఆరాతీస్తే మురళీకృష్ణ అనే టీడీపీకి చెందిన ఎన్నారై ఈమెయిల్స్ రాసినట్టు స్పష్టమైందని వెల్లడించారు. దీనికి లోకేష్ ఏం సమాదానం చెబుతారని నిలదీసారు.
రాష్ట్రంలో సంపాదించిన అవినీతి సొమ్మును సింగపూర్లో పెట్టుబడులు పెట్టడానికే చంద్రబాబు ఈ 30 ఏళ్లలో 58సార్లు వెళ్లి వచ్చారని అమర్నాధ్ ఆరోపించారు. ఎప్పుడైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని దావోస్కి కానీ, సింగపూర్కి కానీ తీసుకెళ్లారా ? ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. తమ హయాంలో జీఐఎస్, దావోస్ ఒప్పందాల గురించి స్పష్టంగా చెబుతామని.. మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినీతి కేసులో అరెస్టయి జైలు జీవితం గడిపిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ తో చంద్రబాబుకి సంబంధాలున్న మాట వాస్తవమా కాదా అని నిలదీసారు.

సింగపూర్లో చంద్రబాబు ఇచ్చిన ప్రజంటేషన్లో రాష్ట్రంలో తుది నిర్మాణ దశలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు, అదానీ డేటా సెంటర్ ఏర్పాటు అన్నీ కూడా వైయస్సార్సీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేసారు. బ్లూ ఎకానమీకి బీజం పడింది వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని అమర్నాధ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications