కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు!!
కాపుల ఓట్లతోనే ఏ పార్టీ అయినా గెలిచేది.. అంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, గెలిచినా కాపుల ఓట్లతోనే సాధ్యపడుతోందన్నారు. ఏపీ జనాభాలో 22 శాతం కాపులున్నారని, 1989 నుంచి రాష్ట్రంలో వారే నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కాపు సామాజికవర్గాన్ని వాడుకొని తర్వాత వదిలేయడం రాజకీయపార్టీల పని అయిందని విమర్శించారు.

కాపు రిజర్వేషన్ల కోసం
రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్లు అమలు కాకపోవడంపై కన్నా విచారం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం చాలామంది పోరాటాలు చేశారని, తాను కూడా కోటా ఆశిస్తున్నట్లు వెల్లడించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని, చంద్రబాబునాయుడు ఈ రిజర్వేషన్లను పూర్తిచేశారన్నారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు కల్పించారన్నారు. ఇవి అమలయ్యే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత ఏం జరిగిందో, జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు.

పవన్ కల్యాణ్ ప్రభావితం కారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పటికీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారని, కాపులను తాను ప్రభావితం చేయలేనని, జనసేనను ఎవరూ ప్రభావితం చేయకుండా చూడాల్సి ఉంది అన్నారు. జనసేనను ఎలా అధికారంలోకి తీసుకురావాలనే విషయాన్ని పవన్ కే వదిలేయాలన్నారు. తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడని, అంతగా ప్రభావితమయ్యే వ్యక్తి కూడా కాదన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు.

కాపు రిజర్వేషన్లు చెల్లుతాయన్న కేంద్రం
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారని, ఇలా ఎందుకు చేయించుకుంటున్నారని? కాపులకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారంటూ ప్రశ్నించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై సర్టిఫికెట్లు జారీచేయబోతున్న తరుణంలో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ రిజర్వేషన్లు చెల్లవని రద్దుచేసిందన్నారు. దీనివల్లే కాపులకు రిజర్వేషన్లు దక్కలేదన్నారు. దీనిపై పార్లమెంటులో జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయని చెప్పింది. ఒకప్పుడు చంద్రాబును కన్నా తీవ్రంగా విమర్శించడమే కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అటువంటిది చంద్రబాబు హయాంలోనే రిజర్వేషన్లు కల్పించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో తెలుగుదేశంలోకానీ, జనసేనలో కానీ చేరబోతున్నారంటూ కన్నాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి ఆయన ఔననడంలేదు.. కాదనడంలేదు.












Click it and Unblock the Notifications