వైసీపీలోకి మాజీ మంత్రి మహీధర్రెడ్డి:టిడిపి శ్రేణుల వింతవాదన
తిరుపతి:మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11 న ఆయన వైసిపిలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
తిరుపతి యాత్రలో ఉన్న ఆయన ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. శనివారం సాయంత్రం తీర్థకట్ట వీధిలోని సాయిబాబా గుడి సన్నిధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు పాదయాత్రలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సాయినాథుని ఆశీస్సులతో ప్రజల ఆకాంక్షల మేరకు వైసిపిలో చేరుతున్నానని మహీధర్రెడ్డి చెప్పారు.
మహీధర్ రెడ్డి...ఫ్లాష్ బ్యాక్
కందుకూరు నుంచి మూడు సార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మానుగుంట మహీధర్రెడ్డి...కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పురపాలక మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దృష్ట్యా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మహీధర్ రెడ్డి వైసిపిలో చేరిక వెనుక కీలక భూమిక పోషించింది నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డిగా తెలుస్తోంది. ఆయనే జగన్ తో మహీధర్ రెడ్డిని మాట్లాడించి పార్టీలో చేరికకు రంగం సిద్దం చేశారని తెలిసింది.
వైసిపిలోకి...ఎందుకంటే?...
రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని మానుగుంట మహీధర్రెడ్డి విమర్శించారు. పైగా తన అనుచరులు, మద్దతుదారులు అందరూ వైసిపిలో చేరాల్సిందిగా కోరారని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా మహీధర్ రెడ్డి తెలిపారు. అయితే మహీధర్ రెడ్డి చేరిక ప్రకటనకు ముందు చాలా ప్రహసనమే నడిచిందని తెలుస్తోంది.
ముందు...చాలా తర్జనభర్జన
మహీధర్ రెడ్డి వైసిపిలో చేరాలన్న ప్రకటనకు ముందు ఏ పార్టీలో చేరాలా అనే విషయంమై చాలా తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో టిడిపికి ఆయనను పార్టీలోకి తీసుకోవాలని ఉన్నా టికెట్ లేదా ఇతర పదవులపై నిర్థిష్ట హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పరోక్ష హామీలు మాత్రం ఇచ్చారట. అయితే మహీదర్ రెడ్డి అనుచరుల్లో ఎక్కువమంది ఆయనను వైసిపిలో చేరాలని కోరారని తెలిసింది. అనుచరులు, మద్దతుదారుల మాటలకు బాగా విలువిచ్చే మహీధర్ రెడ్డి ఆ క్రమంలోనే చివరకు వైసిపి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
పార్టీ మారనని...ఒట్టు
అయితే గత అనుభవాల దృష్ట్యా ఫిరాయింపులపై కలత చెందిన జగన్ వైసిపి నుంచి గెలిస్తే టిడిపిలో చేరనని హామీ తీసుకోవడమే కాకుండా ఏకంగా దైవసాక్షిగా ఒట్టుకూడా వేయించుకున్నారట. స్వతహాగా దైవభక్తి మెండుగా ఉన్న మహీధర్ రెడ్డిని తిరుపతిలో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి కలసి వైసీపీలో చేరతానని, ఎన్నికల్లో గెలిచాక పార్టీ మారనని, పదవి పూర్తయేంతవరకు వైసీపీలోనే కొనసాగుతానని ఒట్టు వేయించారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఉండే మహీధర్రెడ్డి వైసీపీలో చేరనుండడం సంతోషంగా ఉందని చెప్పారు.
టిడిపి వింతవాదన...అనుచరుల మండిపాటు
అయితే మహీధర్ రెడ్డి వైసిపిలో చేరిక పై టిడిపి వింతవాదనపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ప్రజానాయకుడు అయిన తమ నేత టిడిపిలో చేరాలనుకుంటే ఆ పార్టీ వద్దనుకున్నట్లు వింత వాదన ఆ పార్టీ వాళ్లు చేస్తున్నారని, ఎవరెవరినో ఆ పార్టీలోకి చేర్చుకున్న వారు ఎవరైనా పార్టీలో చేరతామంటే టిడిపి వద్దనే పరిస్థితి అసలు ఉందా?...అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందని ద్రాక్ష పుల్లన చందంగా తమ నాయకుడు వైసిపిలో చేరాలనుకోవడం జీర్ణించుకోలేని టిడిపి శ్రేణులు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.