నా మరణదిన వేడుకలకు రండి - మాజీ మంత్రి వింత ఆహ్వానం..!!
ఏపీలో మాజీ మంత్రి పంపిన ఒక ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది. ఇది శుభకార్యానికి సంబంధించి కాదు. ఆ మాజీ మంత్రి మరణదిన వేడుకులు రావాలని ఆ ఆహ్వాన పత్రిక సారాంశం. మరణదిన వేడులకను ఘనంగా చేసుకుంటున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ఎప్పుడు మరణించేదీ చెబుతూ.. ఇక పై ఏటా మరణదిన వేడుకలు జరుపుకుంటానని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి..వైసీపీ నేత పాలేటి రామారావు పంపిన ఒక ఆహ్వానం ఇప్పుడు వైరల్ అవుతోంది. తన మరణ దిన వేడుకలకు రావాలంటూ పాలేటి రామారావు తన అభిమానులకు ఆహ్వానం పంపారు. చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని పాలేటి రామారావు అభిమానులను కోరారు. తన మరణ సంవత్సరాన్ని 2034గా ఆయనకు ఆయనే ప్రకటించుకున్నారు. ఇంకా 12 సంవత్సాల సమయం ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతీ ఏడాది తన మరణ దిన వేడుకలను జరుపుకుంటానంటూ అందులో రామారావు స్పష్టం చేసారు. అందరూ వచ్చి తనను ఆశీర్వదించాలని రామారావు అభ్యర్ధించారు. పాలేటి రామారావు పంపిన ఈ ఆహ్వానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాలేటి రామారావు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 63 ఏళ్లు.. అయితే 75 ఏళ్ల వయసులో అంటే 2034 లో చనిపోతానని ముందుగానే అంచనా వేసుకున్నారు. అందుకే ఈ ఏడాది నుంచి 'మరణ దినం' చేసుకుంటున్నట్లు ఆహ్వాన పత్రికను సిద్దం చేసుకున్నారు. పుట్టిన ప్రతీ ఒక్కరూ మరణించక తప్పదని పేర్కొన్నారు. జీవించి ఉన్నంత వరకూ ఇతరలకు సాయం చేయాలని సూచించారు. అంతే కానీ, అపకారం చేయవద్దని కోరారు. తాను ఎంత కాలం జీవించాలనుకుంటున్నానో ఆలోచించానని వివరించారు. మరణానికి ఒక తారీఖును నిర్ణయించి.. ఇప్పటి వరకు ఎంతకాలం జీవించానో తేల్చానని స్పష్టం చేసారు. ఇంకెంత కాలం ఉందో లెక్కించి.. అన్ని మరణ దినాలను జరుపుకోవాలని నిర్ణయించినట్లు పాలేటి రామారావు వివరించారు.