బీజేపీలోకి టీడీపీ మాజీ మంత్రి: దూరమవుతున్న కాపు నేతలు.. మారుతున్న సమీకరణాలు!
టీడీపీ నుండి కాపు నేతలు వరుసగా వలసల బాట పడుతున్నారు. ఒకరి తరువాత మరొకరు అన్నట్లుగా పార్టీ వీడుతున్నారు. ప్రధానంగా కోస్తా ప్రాంతానికి చెందిన కాపు నేతలు టీడీపీలో కొనసాగటానికి సుముఖంగా లేరు. తాజాగా మాజీ మంత్రి శనక్కాయల అరుణ అనుచరులతో కలిసి బీజీపీ ముఖ్యనేత రాం మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. గుంటూరు జిల్లాలో తటస్థలు కోటాలో అప్పడు చంద్రబాబు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిని చేసి కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారు.
కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీలో క్రియా శీలకంగా వ్యవహరించిన శనక్కాయల అరుణ కొద్ది రోజులుగా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. దాదాపు గుంటూరుకు చెందిన మరో 60 మంది బీజేపీలో చేరారు. కాగా, ఇప్పటికే గుంటూరు చెందిన కాపు నేతలు ఎమ్మెల్సీగా ఉన్న అన్నం సతీష్ ప్రభాకర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీ చేరారు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శాస్త్రవేత చందు సాంబశివరావు సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు.

టీడీపీకి కోస్తా ప్రాంత కాపులు దూరం..
ఇలా.. కోస్తా ప్రాంతంలో బలంగా ఉండే సామాజిక వర్గమైన కాపు వర్గానికి చెందిన ప్రముఖ నేతలు టీడీపీని వీడుతున్నారు. ఎన్నికల వేల ఆమంచి క్రిష్ణ మోహాన్..అవంతి శ్రీనివాసరావు లాంటి వారు పార్టీ వీడి వైసీపీలో చేరారు. ఇక ఎన్నికల్లో ఓడిన తరువాత కాకినాడలో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిన కాపు నేతలు సమావేశమై అధినాయకత్వం మీద అసహనం వ్యక్తం చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారిని బుజ్జగించినా..వారిలో మార్పు రాలేదు. దీంతో..కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరిలో కీలక నేత అయిన తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. అంతకు ముందే మాజీ ఎంపీ తోట నర్సింహం కుటుంబం సైతం వైసీపీలో చేరింది.

కాపు వర్గాన్ని ఆకర్షించేందుకు చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకున్న వంగవీటి రాధా కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ తో సమావేశమయ్యారు. ఇక, విశాఖ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సైతం పార్టీలో కొనసాగలేనని చెబుతున్నారని..ఆయన పార్టీ త్వరలోనే వీడటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. విజయవాడ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సైతం పార్టీ మారుతారని ప్రచారం సాగినా..ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఇలా.. టీడీపీ నుండి కాపు నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో టీడీపీ నేతల్లో ఆలోచన మొదలైంది.
మారుతున్న రాజకీయ సమీకరణాలు..
ఇక వైపు జగన్ అధికారంలో ఉండటంతో రెడ్డి వర్గం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావితం చేయగలిగిన నియోజక వర్గాల్లోనూ టీడీపీ ఓడిపోయింది. దీంతో.. పాటుగా పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న బీసీ వర్గాలు ఈ సారి వైసీపీకి అండగా నిలిచాయి. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావంతో కాపు ఓటర్లు ఎక్కువగా టీడీపీని సమర్ధించారు. ఈ సారి పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ కాపు నేతలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది.
దీని కోసం ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ప్రభావితం చేయగలిగిన నేతలతో నేరుగా పార్టీ ముఖ్య నేతలు మంతనాలు సాగిస్తున్నారు. అదే విధంగా టీడీపీ నుండి ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలను సైతం తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ద్వారా మొత్తంగా స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా జరిగే ఏపీ రాజకీయ పోరులో మొత్తంగా సమీకరణాలే మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications