Kethi Reddy:అయోధ్యలో ఓడిపోయి..ఆదోనిలో గెలవడమేంటి,లెక్క తేలడం లేదే..!!
భారత దేశంలో ఈ రోజు రెండు ప్రధాన అంశాలపై చర్చ జరుగుతోంది. ఒకటి ట్రంప్ విధించిన 50శాతం సుంకాలపై కాగా... మరొక అంశం గురువారం లోక్సభా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్లు చోరీకి గురయ్యాయంటూ అందుకు తగిన సాక్ష్యాలను మీడియా ముందుంచడం. ఈ రెండు అంశాలలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల చోరీ అంశం. ఎన్నికల సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. తాజాగా రాహుల్ గాంధీ చేసింది ఆరోపణలు కాదని అది ఫ్యాక్ట్ అంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన మద్దతు తెలిపారు.
20వేల నుంచి 30వేల ఓట్ల వరకూ...
ఏపీలో 46వేలకు పైగా పోలింగ్ బూత్లు ఉంటే దొంగ ఓటు లేని ఒక్క పోలింగ్బూత్ను చూపించాలంటూ సవాల్ విసిరారు. 2014లో తన ఓటమి తర్వాత విశ్లేషించినట్లు చెప్పుకొచ్చిన కేతిరెడ్డి.. నిన్న రాహుల్ గాంధీ ఎలాగైతే ప్రెస్మీట్ పెట్టి విశ్లేషించారో.. నాడు 2018లో హైదరబాద్ కేంద్రంగా ఉన్న లోటస్పాండ్లో కూడా ఇదే తరహా ఎక్సర్సైజ్ నిర్వహించినట్లు కేతిరెడ్డి వివరించారు.సాధారణంగా ఒక అభ్యర్థి ఎన్నికల నామినేషన్ విత్డ్రా చేసుకునే సమయం వరకు ఓట్లు ఎక్కించుకునే అవకాశం ఈసీ కల్పించిందనే విషయం చాలా తక్కువమందికి తెలుసని అన్నారు.ఎన్నికల సమయంలో నేతలంతా బిజీగా ప్రచారంలో ఉన్న సమయంలో ఈ ఓట్లు ఎక్కించేశారని అన్నారు.ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ విత్డ్రా సమయం వరకు పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో 20వేల నుంచి 30 వేల ఓట్లు పెరిగి ఉంటాయన్నారు.అలా 2018లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ జాబితాను పరిశీలించగా.. 18 లక్షల ఓట్లు అదనంగా చేరాయని అది కూడా తండ్రి పేరు లేకుండా, సరైన అడ్రస్ లేకుండా ఇలాంటివి చాలా గమనించినట్లు కేతిరెడ్డి వెల్లడించారు.ఇది ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.

సత్యకుమార్ ఎవరో ఇప్పటికీ తెలీదు..
ఇక 2019లో అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేసినట్లు చెప్పారు. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీని అనుసంధానం చేయాలని అందులో కోరినట్లు వెల్లడించారు.ఇక తన నియోజకవర్గం విషయానికొస్తే ధర్మవరంలో 60 ఏళ్లు వయస్సు పైబడిన వారికి బీజేపీ సింబల్ తెలీదన్నారు.ధర్మవరం బీజేపీ అభ్యర్థి ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చాడో కూడా అక్కడి ప్రజలకు తెలీదని కేతిరెడ్డి అన్నారు. సత్యకుమార్ యాదవ్ ఒక సాధారణ వ్యక్తిలా,ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లుంగీ కట్టుకుని ఎక్కడ కూర్చున్న ఒక్కరు కూడా గుర్తుపట్టే పరిస్థితి ధర్మవరంలో లేదన్నారు.గతంలో బీజేపీకి 600 ఓట్లు పోలవగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్లు రావడంపై షాక్కు గురైనట్లు చెప్పారు.
అయోధ్యలో ఓడి..ఆదోనిలో గెలవడమా..?
ఫేజ్-1,ఫేజ్-2 ఎన్నికల తర్వాత ఓట్ల చోరీ ఎక్కువగా జరిగిందని ఆరోపించారు కేతిరెడ్డి. ఒడిషాలో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ నుంచి 50కి పైగా ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడం ఏంటని కేతిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చాలా కేసుల్లో సిట్ టెక్నాలజీ వినియోగించి డేటాను రికవర్ చేస్తున్నారని గుర్తు చేసిన కేతిరెడ్డి... మరి ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా జరిగి ఉంటుందని ఎన్నికల సంఘం దీన్నెందుకు రికవర్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆదోనికి ఎమ్మెల్యే పార్థసారథి బెల్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అని అక్కడి నుంచే ఈవీఎంలు వచ్చాయని పరోక్షంగా గుర్తుచేశారు కేతిరెడ్డి. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడమేంటి.. ముస్లిం జనాభా ఉన్న ఆదోనీలో బీజేపీ గెలవడమేంటని కేతిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం నిర్మించి పెద్ద ఎత్తున ప్రారంభించి అక్కడ బీజేపీ ఎలా ఓడిపోయిందని ప్రశ్నించారు.
మొత్తానికి కేతిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలతో తెలుగు రాష్ట్రాల్లో 2024 సాధారణ ఎన్నికలపై చర్చ మరింత బలంగా జరగుతోంది. సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ సైతం ఎన్నికల నిర్వహణపై అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.












Click it and Unblock the Notifications