కృష్ణలంక ఘటనపై మల్లాది విష్ణు: స్వర్ణబార్ నాది కాదు, ఎవరో పాయిజన్ కలిపారు
అమరావతి: ఆరుగురు మృతికి కారణమైన విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్ యజమానిగా ప్రచారం సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. మీడియాలో ప్రచారం సాగుతున్నట్టుగా కృష్ణలంకలోని స్వర్ణబార్ తనది కాదని, అది తన బంధువులదని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి విచారణ చేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. కృష్ణలంకలోని స్వర్ణ బార్ తన బంధువులది అయినప్పటికీ, ఈ ఘటనపై విచారణ జరపించాలన్నారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆరుగురి మృతికి కారణమైన ఈ ఘటనలో కల్తీ మద్యం కారణం కాదని ఆయన పేర్కొన్నారు. ఎవరో కావాలనే బార్కు చెందిన వాటర్ కూలర్లో ఏదో కలిపారని, అందుకే ఈ దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఈ ఘటన సంభవించడం తనకు కూడా చాలా బాధాకరంగా ఉందన్నారు.

బార్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పుటేజీలను పరిశీలించి ఈ విద్రోహ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బార్లో కొన్న మద్యాన్ని మినరల్ వాటర్తో కలుపుకుని సేవించిన వారి పరిస్థితి బాగానే ఉండగా, వాటర్ కూలర్లోని నీటితో కలుపుకుని తాగిన వారే అస్వస్థతకు గురవడం ఇందుకు నిదర్శనమన్నారు.
కల్తీ మద్యం అనేది జరగి ఉండకపోవచ్చని అన్నారు. కేవలం వాటర్ వల్లనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ దారుణానికి పాల్పడ్డవారు ఎవరన్న విషయాన్ని త్వరలోనే తేలుస్తామని ఆయన చెప్పారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు.
విజయవాడ ప్రభత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జరిగిన అనంతరం సంఘటనా స్థలానికి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్వర్ణ బార్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని ఆరోపించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications