జగన్ వాటిపై నోరెత్తితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరిక .. అందుకే ఇలా ..ఉండవల్లి సంచలనం
పోలవరం విషయంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు . గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టులు కడుతున్నా సీఎం జగన్ నోరు మెదపటం లేదని ఆరోపించారు . సీఎం జగన్ వాటిపై ప్రశ్నించడానికి, నోరెత్తి మాట్లాడటానికి భయపడుతున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు . ఎందుకంటె జగన్ ఆస్తులు అన్నీ పక్క రాష్ట్రంలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు .

తెలంగాణ రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులపై ఉండవల్లి సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులపై నోరెత్తితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని ఆరోపించారు ఉండవల్లి అరుణ్ కుమార్.
గోదావరి నదీ జలాలు వృథాగా పోతున్నాయని, ఏపి దాటిన తర్వాత నిరుపయోగంగా సముద్రంలో కలిసిపోతున్నాయన్న ఆయన ఆ నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్ కడితేనే పోలవరం వల్ల ఉపయోగం ఉంటుందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రం వద్ద ఈ విషయంలో గట్టిగా మాట్లాడడం అవసరమని ఆయన స్పష్టం చేశారు .

డీపీఆర్ ప్రకారం పోలవరం పూర్తి స్థాయిలో కట్టాల్సిందే
పోలవరం వద్ద తప్ప రిజర్వాయర్ కట్టడానికి మరెక్కడా అవకాశం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అది కట్టాలంటే పునరావాసం క్రింద పరిహారం ఇవ్వాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని ,అది కేంద్రమే చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రానికి గట్టిగా సీఎం జగన్ నిలదీయ లేకపోతున్నాడు అంటూ వ్యాఖ్యానించిన ఉండవల్లి అరుణ్ కుమార్ డీపీఆర్ ప్రకారం పూర్తిస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు లేదంటే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జగన్ కేంద్రంతో పోలవరం ప్రాజెక్టు పై జరిపిన సంప్రదింపులపై శ్వేత పత్రం విడుదలకు డిమాండ్
సీఎం కేసీఆర్ మాటలు విని భయపడితే లాభం లేదన్నారు. పక్కరాష్ట్రంలో ఆస్తులు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పునరావాస ప్యాకేజీ నిధులపై రాజీపడితే రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసినవారవుతారు అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సీఎం జగన్ కేంద్రంతో పోలవరం ప్రాజెక్టు పై జరిపిన సంప్రదింపుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. నిజాలు చెప్పకుండా సీఎం జగన్ జనాలని మభ్యపెడుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తయ్యేవరకూ తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలని ఉండవల్లి సూచించారు.

పోలవరం నిర్మాణం విషయంలో భయపడితే తీవ్ర నష్టం
గతంలో సమాచార హక్కు చట్టం ప్రకారం రమేష్ చంద్ర అనే వ్యక్తి అడిగిన ప్రశ్నలకు కేంద్రమే అన్ని కల్పిస్తుందని స్పష్టంగా రాసి ఉందని, పునరావాసం, ఆర్ అండ్ ఆర్, భూసేకరణ, పరిహారాన్ని కూడా కేంద్రమే ఇస్తామని నాడు సమాధానంలో చెప్పిందని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో, గోదావరి నదీ జలాలను ఉపయోగించే విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆంధ్ర రాష్ట్ర హక్కును, ఆంధ్ర ప్రజల గళాన్ని కేంద్రానికి వినిపించాలని ఉండవల్లి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications