వైసీపీలోకి కేశినేని నాని, జగన్ కీలక హామీ: కుమార్తె సీటు ఫిక్స్ - సర్వేలో తేలిందిదే..!!
ఏపీలో ఎన్నికల రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ టీడీపీ ఎంపీ వైసీపీలోకి ఎంట్రీ ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నాని పోటీ చేయటం దాదాపు ఖరారైంది. టీడీపీని వీడాలని నాని నిర్ణయించిన సమయం నుంచి వైసీపీ పావులు కదిపింది. ఇదే సమయంలో నాని కుమార్తె సైతం టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరికీ జగన్ ఇచ్చిన హామీలు..ఎన్నికల్లో పోటీతో విజయవాడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
మారుతున్న రాజకీయం: కృష్ణా తీరాన రాజకీయం రంజుగా మారుతోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ రెండు సీట్లతో పాటుగా లోక్ సభ సీటులో విజయం సాధించింది. ఆ తరువాత పరిణామాల్లో గన్నవరం నుంచి గెలిచిన వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అదే పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇంచార్జ్ ల మార్పులో భాగంగా ఈ జిల్లాలో సీఎం జగన్ పెద్దగా మార్పులు చేయలేదు.

పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. ఆయనతో వరుసగా వైసీపీ నేతలు జరిపిన మంత్రాంగం విఫలమైంది. ఇదే సమయంలో విజయవాడ టీడీపీ ఎంపీ పార్టీ వీడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి ఆహ్వానం రావటంతో జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించారు.
వైసీపీ నుంచి ఎంపీగా బరిలో: కేశినేని నాని టీడీపీలో కొనసాగటం కొంత కాలంగా సందేహంగానే కనిపించింది. అంచనా వేసినట్లుగానే ఆయన టీడీపీ వీడారు. స్వతంత్రగా పోటీ చేస్తారని భావించినా ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఈ మధ్నాహ్నం నాని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరటం ఖాయమైంది. వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే నానితో మంతనాలు చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ లోక్ సభ సీటు ఆఫర్ చేసారు.

దీంతో, స్వతంత్రంగా పోటీ అదే సమయంలో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేయటం పైన మూడు ప్రముఖ సంస్థలతో సర్వే చేయించారు. అందులో స్వతంత్రంగా పోటీ చేయటం కంటే వైసీపీ నుంచి పోటీ చేయటం ద్వారా గెలుపు ఖాయమని అంచనాలు వచ్చాయి. దీంతో, తన అనుచర గణంతో చర్చించిన తరువాత వైసీపీ ఆహ్వానం పైన అభిప్రాయ సేకరణ చేసారు. మెజార్టీ ఆమోదం లభించటంతో వైసీపీలో చేరేందుకు నాని డిసైడ్ అయ్యారు.
కుమార్తెకు సీటు దక్కేనా: ఇక, ఇదే సమయంలో నాని కుమార్తె శ్వేతకు ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లోనే శ్వేతను మైలవరం నుంచి బరిలోకి దింపాలనేది కేశినేని నాని ఆలోచనగా తెలుస్తోంది. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకు తిరిగి సీటు పైన జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, పెనమలూరు నుంచి కేశినేని శ్వేతను వైసీపీ అభ్యర్దిగా బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పార్ధసారధి పార్టీ వీడాలని నిర్ణయించటంతో శ్వేతకు ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని నాని అనుచరులను పార్టీలో చేర్చుకొనేలా ఈ నెలాఖరులోగా విజయవాడలో మరో సభ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. దీంతో,కేశినేని నాని వైసీపీలో చేరిక...భవిష్యత్ రాజకీయం పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications