వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది: మహిళ హత్య కేసును ఛేధించారు
కృష్ణా: గుడివాడ రైల్వేస్టేషన్ సమీపంలోని ఐవోడబ్ల్యూ కార్యాలయం దగ్గర శనివారం అర్ధరాత్రి జరిగిన మహిళ హత్య కేసును టూటౌన్ పోలీసులు 24గంటల్లో ఛేదించడంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే నిందితుడు ఆమెను హత్య చేసినట్లు తేలింది.
సోమవారం సాయంత్రం స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో సిఐ కె శివాజి నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. హత్యకు గురైన మహిళ అనమకూరి భాగ్యలక్ష్మి(35)గా గుర్తించామన్నారు.
భర్తతో విడిపోయిన భాగ్యలక్ష్మి రైల్వేస్టేషన్ సమీపంలో ఒక హోటల్లో పని చేసుకుని జీవిస్తోందన్నారు. కొంతకాలంగా ఆమెకు రైలుపేటకు చెందిన ఒంగోరి నాగేంద్రబాబు అలియాస్ రవితో వివాహేతర సంబంధం ఉందన్నారు. శనివారం అర్థరాత్రి భాగ్యలక్ష్మి రైల్వేషెడ్ దగ్గరకు రావాలని నాగేంద్రబాబు కబురు చేశాడు. వచ్చిన భాగ్యలక్ష్మిని.. ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీశాడు నాగేంద్రబాబు.
ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భాగ్యలక్ష్మిని నాగేంద్రబాబు బలంగా డొక్కలో తన్నడంతో ఒక్కసారిగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. భాగ్యలక్ష్మికి ఫిట్స్ వచ్చిందనే అనుమానంతో సమీపంలోని వాచ్మేన్ దగ్గరకు వెళ్ళి తాళాలు ఇవ్వాలని కోరాడు. తాళాలు లేవని వాచ్మేన్ చెప్పడంతో నాగేంద్రబాబు తన జేబులో ఉన్న నరాల బలహీనతకు వేసుకునే మందుబిళ్ళను ఆమె నోట్లో వేసి నీళ్ళు పోశాడు.
అయినప్పటికీ భాగ్యలక్ష్మి స్పృహలోకి రాకపోవడంతో ఆమె మృతి చెందిందని భావించిన నాగేంద్రబాబు అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు సిఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ దుర్గాప్రసాద్, రైటర్ ఆంజనేయులు పాల్గొన్నారు.