వివాహేతర సంబంధం: అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య
గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ దుర్మార్గపు మహిళ. ఈ ఘటన నూజండ్లలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నకరికల్లు మండలం చేజర్లకు చెందిన పోట్లూరి అమరలింగయ్య(32)కు అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణితో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమరలింగయ్య దంపతులు ఉపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితం నూజండ్లలో ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నారు.
అయితే కృష్ణవేణికి స్థానికంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో దంపతులిద్దరు కొంతకాలంగా గొడవపడుతున్నారు. శనివారం రాత్రి కూడా వారు ఈ విషయమై గొడవపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
శనివారం అర్ధరాత్రి తన భర్త హత్యకు గురైనట్లు కృష్ణవేణి కోళ్లఫారం యాజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగిన రూరల్ సీఐ .శ్రీనివాసరావు, ఎస్ఐ విజయచరణ్ విచారణ చేపట్టారు. అమరలింగయ్యకు ఒంటిపై గాయాలుండటంతో పాటు కిరాతకంగా కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. కాగా, చంపేందుకు వినియోగించిన కత్తి కడుపులో దిగబడే ఉంది.
పోలీసులు క్లూస్టీంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. కృష్ణవేణి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం, చేతికి రక్తపు మరకలు ఉండటంతో హత్య వెనుక ఆమె ప్రమేయం ఉంటుందని పోలీసులు గుర్తించారు.అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
సమాచారం అందుకున్న అమరలింగయ్య బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అమరలింగయ్యను భార్య కృష్ణవేణి చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య వెనుక భార్యతో పాటు ఎవరి ప్రమేయం ఉందనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. భార్య వేలిముద్రలతో సరిపోల్చాల్సి ఉందని చెప్పారు. పూర్తి విచారణ అనంతరం అన్ని విషయాలు బయటికొస్తాయని తెలిపారు.