రాయలసీమలో ఫ్యాక్షన్ ఫియర్ : మద్యం సేవించి నాటు బాంబులతో వ్యక్తి వీరంగం, వరుస ఘటనలతో భయం
రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ పడగ విప్పుతోందా ? ఇటీవల కాలంలో వరుసగా నాటుబాంబులు కలకలం సృష్టించిన ఘటనలు చోటుచేసుకోవడం అందుకు ఊతమిస్తోందా ? చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

మద్యం మత్తులో నాటు బాంబులతో వ్యక్తి వీరంగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మళ్లీ నాటుబాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించడం తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి పాకాల మండలం వల్లివేడు పంచాయితీలో నాటు బాంబులతో తీవ్ర కలకలం రేగింది . 10 నాటు బాంబుల సంచితో కృష్ణయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. దీంతో ఒక నాటు బాంబు పేలింది. ఒక్కసారిగా స్థానికులంతా నాటు బాంబు పేలడంతో ఉలిక్కిపడ్డారు.

నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అంతకు ముందు అనేక ఘటనలు
అయితే నాటు బాంబు పేలినప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో నాటు బాంబులతో వీరంగం వేసిన వ్యక్తి పరారయ్యాడు. నాటు బాంబుల సంచిని అక్కడే వదిలి వెళ్లడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ గా ఓ వ్యక్తి సంచీలో తీసుకుని వెళ్లడం కలకలం రేపింది. నాటు బాంబులను ఒక సంచిలో పెట్టి పబ్లిక్ గా తీసుకుని వెళుతున్న దొరస్వామి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో పబ్లిక్ గా సంచిలో 20 నాటు బాంబులు తీసుకెళ్తున్న వ్యక్తి అరెస్ట్
దొరస్వామి అనే వ్యక్తి నుండి 20 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ నాటుబాంబులు దేని కోసం తయారు చేశారు? ఎక్కడ తయారు చేశారు? వాటిని ఎందుకు వినియోగిస్తున్నారు అన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అడవిలో జంతువులు వేటాడటం కోసం నాటుబాంబులు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అయినప్పటికీ దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి కొత్తపల్లిమిట్ట రహదారి గొడుగు చింత వద్ద మొత్తం 20 నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో స్థానికంగా చర్చ జరిగింది.

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో ఎస్వీ యూనివర్సిటీలో నాటు బాంబుల పేలుడు
ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికకు ముందు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో నాటు బాంబులు పేలడం కలకలం రేపింది .తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో హెచ్ బ్లాక్ సమీపంలో రెండు నాటు బాంబులు పేలడంతో ఒక కుక్క, పంది మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. హెచ్ బ్లాక్ పద్మావతి కోవిడ్ సెంటర్ కు మధ్యలో నాటు బాంబుల పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
Recommended Video

వరుస ఘటనలతో రాయలసీమలో ఫ్యాక్షనిజం అనుమానాలు .. ప్రజల్లో భయం
గత కొంతకాలంగా చూస్తే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట నాటు బాంబుల కలకలం రేగుతూనే ఉంది. తాజాగా ప్రతి జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు మళ్ళీ రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిందా అన్న అనుమానాలకు కారణంగా మారుతుంది. ఇక తాజాగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఘర్షణలు, దాడులు, హత్యల నేపథ్యంలో నాటు బాంబుల తయారీ పై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం, కట్టడి చేయాల్సిన అవసరం పోలీసులపై ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications