తిరుపతి రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు
అమరావతి: తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున బాంబు కలకలం రేగింది. నిత్యం లక్షల మంది ప్రయాణీకులతో రద్దీగా ఉంటే తిరుపతి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామన్న గుర్తు తెలియని దుండగుల ఫోన్ కాల్స్తో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తిరుపతి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి పోలీస్ హెల్ప్ లైన్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల వరకు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 8 డాగ్ స్క్వాడ్, 4 బాంబ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. అయితే చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల తనిఖీలను చూసి అక్కడున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంగళవారం రాత్రి 11:30కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.