జగన్ పథకాలు ఎత్తేస్తున్నారంటూ సోషల్ పోస్టులు-12మందిపై సీఐడీ కేసులు-ఒకరు అదుపులోకి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం కూడా కలకలం రేపుతోంది. వ్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వ్యవహారంలో గతంలో ప్రభుత్వాధికారుల్ని, వయోవృద్ధులకు కూడా నోటీసులు పంపి, విచారణ జరిపిన సీఐడీ.. మరోసారి కొరడా ఝళిపిస్తోంది. తాజాగా మరో 12 మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
జగన్ సర్కార్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యవహారంలో మంగళగిరి సిఐడీ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో పలువురి పై కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మ ఓడి , వాహన మిత్ర పథకాలు తొలగిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు పోస్టింగ్ లు పెడుతున్నారు. అలాగే సోషల్ మీడియా లో వచ్చిన ఈ పోస్ట్ లను పలువురు షేర్ చేశారు. దీనిపై సీఐడీ సీరియస్ అయింది.
సోషల్ మీడియా లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే ఉద్దేశంతో కోగంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని ఏపీ సీఐడీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. కోగంటి శ్రీనివాస్ తో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు.ఐటీ చట్టంలోని 66-C, ఐపీసీలోని 505(2), 464, 465, 466, 469, 471, 474, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఆర్పీసీలోని సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారు. కోగంటి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సీఐడీ అధికారులు.. రేపు విచారణకు రావలసిందిగా మరికొంత మందికి నోటీసుల్లో పేర్కొన్నారు.