పవన్, మోడీ పైనే: విజయమ్మపై హరిబాబు గెలుస్తారా?
విశాఖ: సీమాంధ్రలో పలు నియోజకవర్గాలతో పాటు విశాఖ లోకసభ సీటు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విశాఖ లోకసభ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, బిజెపి తరఫున టిడిపి బలపర్చిన కంభంపాటి హరిబాబు పోటీ పడుతున్నారు. విజయమ్మతో బిజెపి సీమాంధ్ర చీఫ్ పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా మారింది.
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపితో సమానంగా ఢీకొంటోంది. రాజకీయాల్లోకి వచ్చాక విజయమ్మ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పట్టు ఉంది. అయితే, బిజెపికి ఇప్పటి వరకు టిడిపిలో పెద్ద క్యాడర్ లేదు. అదే సమయంలో హరిబాబు పెద్దగా సుపరిచితులు కారు. తరిచి చూస్తే.. విజయమ్మపై హరిబాబు పోటీ అంత ఈజీ కాదనే చెప్పవచ్చు.

బిజెపికి టిడిపి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. అయితే టిడిపికి మాత్రం మంచి క్యాడర్ ఉంది. వ్యక్తిగతంగా హరిబాబుకు, ఇప్పటి వరకు పార్టీకి పట్టు లేకపోయినప్పటికీ ఇటీవలి పరిణామాలకు టిడిపి మద్దతు తోడైతే తమ గెలుపు ఖాయమని బిజెపి భావిస్తోంది. రాష్ట్ర విభజనకు జగన్ పరోక్షంగా సహకరించాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కొద్ది రోజులుగా దేశంలో మోడీ హవా కనిపిస్తోంది. అలాగే సీమాంధ్ర అభివృద్ధి బిజెపి వల్లనే సాధ్యమని చెబుతూ పురంధేశ్వరి, కావూరి వంటి నేతలు ఆ పార్టీలో చేరారు. దానికి తోడు టిడిపి మద్దతు. ఇవన్నీ తమను గట్టెక్కిస్తాయని హరిబాబు ధీమాగా ఉన్నారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపి కూటమి తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత వారం పవన్ హరిబాబు కోసం ప్రచారం నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది.
విశాఖ ప్రజలు స్థానిక నేతను కోరుకుంటున్నారని, విజయమ్మ స్థానికేతరురాలని, అలాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం వస్తున్నందున విశాఖ అభివృద్ధికి బిజెపిని గెలిపించాలనుకుంటున్నారని, టిడిపి మద్దతు, పవన్ ప్రచారం తమకు కలిసి వస్తుందని హరిబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి పట్టణ తరగతి ఓట్ల పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే, గ్రామీణ, మధ్య తరగతి ఓటర్లతో పోల్చితే పట్టణ ఓటర్లు తక్కువ. గ్రామీణ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉంది. అయితే, గ్రామీణ ప్రాంతంలో టిడిపికి కూడా బలమైన క్యాడర్ ఉన్నందున వారు మద్దతిస్తే విజయమ్మ పైన హరిబాబు గెలుపొందడం కష్టం కాదని అంటున్నారు.
విశాఖ లోకసభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడింటిలో టిడిపి, జగన్ పార్టీలకు పట్టు ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, విజయమ్మ గెలుపును ఎవరు ఆపలేరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటోంది. నియోజకవర్గ పరిస్థితి అంచనా వేస్తే విజయమ్మ గెలుపు ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications