శ్రీకాకుళం కలెక్టరేట్లో రైతు ఆత్మహత్యాయత్నం...రాష్ట్రంలో వరుస ఘటనలపై కలకలం...
శ్రీకాకుళం: శ్రీకాకుళం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టించింది. అయితే అక్కడ ఉన్న అధికారులు వెంటనే స్పందించి రైతుని నిలువరించడంతో ముప్పు తప్పింది. అయితే రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు సంబంధించి ఇది నాలుగో ఘటన కావడం గమనార్హం.
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసిన ఓ రైతు ఆత్మహత్యయత్నం చేయడం సంచలనం సృష్టించింది. సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జరిగే ఫిర్యాదుల దినోత్సవానికి జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన టంకాల మోహన్ రంగ అనే విచ్చేశాడు. తాను సన్నకారు రైతు నని తన వ్యవసాయ భూమికి విద్యుత్తు కనెక్షన్ మంజూరు చేయాలంటూ రెండేళ్లుగా విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులు విన్నవించినా సమస్య తీరలేదని పెద్దగా అరుస్తూ ఆత్మహత్యా యత్నం చేశాడు. వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న రైతును రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించి అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ బాధితుడి వద్దకు వచ్చి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అయితే రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరుసగా ఈ తరహా ఘటనలు నమోదవడం అధికారులను కలవరపెడుతోంది. గతంలో కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నా...ఎపిలో ఈ ఒక్క వారం వ్యవధిలోనే ఈ తరహా ఘటన ఇది నాలుగోది కావడం గమనార్హం. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం బ్రహ్మయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి చనిపోయాడు. ఆ మరుసటి రోజే మరో రైతు తనను ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని అధికారులకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. శనివారం తూర్పు గోదావరి జిల్లాలో ఓ విఆర్వో తనను తహసీల్దార్ వేధిస్తున్నాడంటూ వాట్సాప్ లో సూసైడ్ నోట్ పెట్టి అదృశ్యమయ్యాడు. తాజాగా సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ లో జరిగిన ఘటన నాలుగోది.












Click it and Unblock the Notifications