కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు .. తరలిస్తే ఆత్మహత్యలే శరణ్యం .. జగన్ స్పందించాలని డిమాండ్
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలతో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు .బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న రైతులు ప్రభుత్వం తక్షణం రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి నుండి రాజధాని తరలిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్తున్నారు. ఆందోళన బాట పట్టిన రాజధాని ప్రాంత రైతులు నేడు కృష్ణాయపాలెంలో రాజధాని విషయంలో మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు.
జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయి ..బొత్సా వ్యాఖ్యలకు విలువ లేదన్న అచ్చెన్నాయుడు
మంత్రి వ్యాఖ్యలకు నిరసన ..రహదారిపై బైఠాయించి రాజధాని రైతులు ఆందోళన
రాజధాని అమరావతిని మారుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధానిని దొనకొండకు మారుస్తున్నారన్న వార్తల నేపధ్యంలో దోనకొండలో భూములు కోట్ల విలువ పలుకుతున్నాయి. ఇక అమరావతి ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ఇక రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సందిగ్ధంలో పడ్డారు. తాజాగా ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే సహించేది లేదని వారు తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంటే తాము సైతం తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని , ఆత్మహత్యలకు కూడా వెనుకాడమని రాజధాని ప్రాంత రైతులు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రి బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో సచివాలయానికి వెళ్లే దారిలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా స్పందించని సీఎం జగన్
ఇప్పటికే రాజధాని నిర్మాణం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో బొత్సా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు తుళ్లూరు మండలం వెలగపూడిలో కూడా రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను నిలిపివేసి రహదారిపై బైఠాయించిన రైతులు రాజధాని ముంపు ప్రాంతంలో లేదని, రాజధానిని తరలించే యోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు. ఇంతగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరి చెప్పలేదు . జగన్ అసలు తన నిర్ణయం ఏమిటో ఇప్పటికీ ప్రకటించలేదు.
రాజధాని మార్పుపై తలా ఒక మాట .. రాజధాని తరలింపు విషయంలో జగన్ ఆంతర్యం ఏమిటో ?
ఒక పక్క టీజీ వెంకటేష్ ఏపీకి నాలుగు రాజధానులని , ఈ విషయంలో జగన్ కేంద్రంతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. ఇక సుజనా చౌదరి రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం అని, జగన్ నిర్ణయం ఏం తీసుకుంటే అదే ఉంటుందని పేర్కొన్నారు. కానీ రాజధాని మార్చే ఆలోచన చెయ్యరని , ఒకవేళ చేస్తే రైతుల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డి రాజధాని మార్పు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నాయకులు రాజధాని తరలింపు అంశంపై జగన్ సర్కార్ మీద నిప్పులు చెరుగుతున్నారు. కానీ జగన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. జగన్ మనసులో అసలు ఏముందో అంతు చిక్కక నేతలు తెగ ఇబ్బంది పడుతున్నారు .