రైతులకు వీఐపీ హోదా కల్పిస్తాం: నారాయణ, కెసిఆర్నూ పిలుస్తాం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రాజధాని శంకుస్థాపన పర్వదినం నాడు సభాస్థలి వద్ద వీఐపీ హోదా కల్పిస్తామని రాష్ట్ర మంత్రి పీ నారాయణ బుధవారం నాడు వెల్లడించారు.
రాజధానికి శంకుస్థాపన చేసే ఉద్దండరాయునిపాలెం వద్ద పనులు జరుగుతున్నాయి. వీటిని మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ విలేకరులతో మాట్లాడారు.
నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కోసం ఆహ్వాన పత్రిక సిద్ధమవుతోందని తెలిపారు. మన చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఆహ్వానపత్రిక ఉంటుందని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, వివిధ దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానిస్తామన్నారు.
గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాన వేదిక ప్రాంతం వద్ద భూమి చదును పనులను బుధవారం ప్రారంభించారు. ప్రధాన వేదిక వద్ద వారు ఏర్పాట్లను పరిశీలించారు.
మంగళగిరిలోనే ఎయిమ్స్
ఏపీకి కేంద్రం ప్రకటించిన అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇంతకుముందు అనుకున్నట్లుగానే గుంటూరు జిల్లా మంగళగిరలోనే ఈ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఏర్పాటు కానుంది.
ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నేటి ఉదయం ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కెసిఆర్ను ఆహ్వానిస్తాం
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆహ్వానిస్తామని నారాయణ మంగళవారం చెప్పారు. కెసిఆర్తో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ను ఆహ్వానిస్తామని చెప్పారు.