దమ్ముంటే ఆ మాట ఇక్కడకొచ్చి అనండి : బొత్సకు రాజధాని రైతుల సవాల్
రైతుల పేరిట పెయిడ్ ఆర్టిస్టులు ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు భగ్గుమన్నారు. ఆ మాట దమ్ముంటే రాజధాని ప్రాంతానికి వచ్చి అనాలని సవాల్ విసిరారు. ఇక్కడకొస్తే తమ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపిస్తామని,అప్పుడు తాము పెయిడ్ ఆర్టిస్టులమా? రైతులమా? అన్న సంగతి తెలుస్తుందన్నారు.
రైతులు,రైతు కుటుంబాలు ఆందోళనల్లో పాల్గొంటుంటే మంత్రులు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు.. ఆ భూముల్లో ప్లాట్లు చేసిస్తామని బొత్స చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్లాట్లు చేసుకోవడం తమకు మాత్రం రాదా? అని ప్రశ్నించారు.
మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తుళ్లూరు,వెలగపూడి,మందడం గ్రామాల్లో మహాధర్నా చేపట్టారు. రైతు కుటుంబాలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
జగన్ ప్రభుత్వానికి అభివృద్దిపై ముందు చూపు లేదని విమర్శిస్తూ.. కళ్లకు గంతలు కట్టుకుని వారు నిరసన తెలుపుతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేంతవరకు తమ పోరాటం ఆపేది లేదని చెబుతున్నారు. మరోవైపు మంత్రులు,వైసీపీ నేతలు మాత్రం ఇదంతా టీడీపీ ఆడిస్తున్న డ్రామా అని ఆరోపిస్తున్నారు. రైతుల భూములు కొట్టేసినవాళ్లు,పచ్చా చొక్కాలు వేసుకున్నవాళ్లే రాజధాని ప్రాంతంలో ఆందోళనలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.