జగన్, చంద్రబాబు దీక్షలు: వ్యూహాత్మక తప్పిదం?
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పార్టీ శ్రేణులను, ప్రజలను తమ వైపు తిప్పుకుని విశ్వాసాన్ని పాదుకొల్పే విషయంలో తప్పు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన జగన్ నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఐదురోజులు ఆమరణ దీక్ష చేశారు. బుధవారం రాత్రి జగన్ ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు దీక్ష చేయడం రాజకీయ తప్పిదమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నెల 19వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యశంఖారావం పేరిట పెద్ద సభను హైదరాబాద్లో నిర్వహిస్తోంది.

జైలు నుండి విడుదలైన తర్వాత జగన్ బాగా నీరసంగా ఉన్నారు. వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. రెండోసారి ఆమరణదీక్షకు వెళ్లకుండా, జిల్లాల్లోని నేతలు, కార్యకర్తలతో మాట్లాడి ఉద్యమాన్ని ఉత్సాహపరిచే విధంగా కార్యాచరణను రూపొందించి ఉంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేదని అంటున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీల నాయకులను కలుసుకుని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వినతిపత్రాలు సమర్పించడం, వారితో చర్చించడం కాస్తా మెరుగు అని భావిస్తున్నారు.
జగన్ దీక్షకు కూర్చోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీలో దీక్షకు ఉపక్రమించారు. చంద్రబాబు దీక్షను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. చంద్రబాబు ఢిల్లీ దీక్ష వల్ల జాతీయ మీడియాలో ఆంధ్ర, రాయలసీమ ప్రజల ఆందోళనకు ప్రచారం లభించింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసును ఎత్తిచూపి, జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించడంలో చంద్రబాబు కాస్తా విజయం సాధించారనే చెప్పవచ్చు.

ఇరువురు నేతలు దీక్షలకు దిగిన సమయంలోనే విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీక్షలను విరమించారు. ఆర్టీసి సిబ్బంది కూడా శుక్రవారం దీక్షలను విరమిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎన్జీవోలు కూడా దీక్షలను విరమిస్తారంటున్నారు. ఈ స్థితిలో సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు, జగన్ చివరి అస్త్రాలను కూడా ప్రయోగించి, అంతగా ఫలితం సాధించలేకపోయారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications