బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో దోషికి ఉరిశిక్ష: సంచలన తీర్పునిచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
గుంటూరు జిల్లాలోని కాకాణిలో నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యను ప్రేమోన్మాది దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటనలో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. గుంటూరు పరమయ్యకుంటకు చెందినబీటెక్ విద్యార్థిని రమ్యను హతమార్చిన నిందితుడు కుంచాల శశికృష్ణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.
నడిరోడ్డు మీద బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య
గతేడాది ఆగస్టు 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా కాకాణిలో నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యను శశి కృష్ణ అనే నిందితుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇంటి నుండి సమీపంలోని ఒక షాప్ కి వెళ్లిన సమయంలో శశి కృష్ణ అనే యువకుడు షాపు వద్ద ఆమెతో గొడవకు దిగి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. విచక్షణారహితంగా రమ్యపై దాడి చేసిన నేపథ్యంలో స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే రమ్య మృతి చెందింది.
ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపిన రమ్య హత్య
ఇక హత్య ఘటనపై ప్రతిపక్ష టీడీపీ నేతలు అధికార పార్టీని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నడి రోడ్డు మీద జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటన అప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య పై స్పందించిన సీఎం జగన్ బాధితురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించడమే కాకుండా, ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితుడికి ఘటన శిక్షపడేలా చేయాలని అధికారులను ఆదేశించారు.
రమ్య హత్యకేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన హత్య దృశ్యాలు ఆధారంగా నిందితుడు శశి కృష్ణను నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఆపై డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 36 మందిని విచారించి 15 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేశారు. ఇక హత్య ఘటనపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం శారదామణి 28 మందిని విచారించారు.
8 నెలల పాటు సాగిన విచారణ.. రమ్య తల్లిదండ్రుల స్పందన
మొత్తం 8 నెలల పాటు ఈ కేసులో విచారణ సాగింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, అదేవిధంగా సిసి టివి ఫుటేజ్ ఆధారంగా ఈనెల 26వ తేదీన విచారణ పూర్తి చేశారు. ఈరోజురమ్య హత్యకు కారకుడైన శశి కృష్ణకు ముద్దాయిగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు విధించిన శిక్షపై రమ్య తల్లిదండ్రులు స్పందించారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి లభించిందని,నిందితుడికి సరైన శిక్ష పడిందని వారన్నారు.