డబ్బు కోసం కన్నకొడుకునే కిడ్నాప్ చేసిన తండ్రి: చంపేస్తానని బెదిరింపు, తల్లి ఫిర్యాదుతో !!
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కన్న కొడుకునే కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వకపోతే కొడుకును చంపేస్తానని కట్టుకున్న భార్యనే బెదిరించాడు. దీంతో కొడుకుని కాపాడుకోవడం కోసం పోలీసులను ఆశ్రయించిన తల్లి సదరు భర్తపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కసాయి తండ్రి బారినుండి కొడుకుని కాపాడి తల్లికి అప్పజెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రాకారం పల్నాటి రామకృష్ణారెడ్డి, ఉమా దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం కందుకూరులో వర్క్ ఫ్రం హోం పనిచేస్తున్న అతను, మద్యానికి, జూదానికి, వ్యభిచారానికి అలవాటు పడి భార్యని నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 20 లక్షలకు పైగా అప్పులు చేసిన అతను, ఆ అప్పు తీర్చే మార్గం లేక కన్నకొడుకు ప్రాణాలతోనే బేరమాడాడు.
తన మూడేళ్ల కుమారుడు శర్వాన్ రెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకువెళ్లి, భార్యకు, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి 20 లక్షల డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే బాలుడికి పురుగుల మందు తాగించి చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు కొడుకు కోసం వెతికిన తల్లి, ఆమె బంధువులు ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సెల్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా రామకృష్ణా రెడ్డిని ట్రేస్ చేశారు.
కందుకూరు పట్టణంలో స్వర్ణ ప్యాలెస్ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్టు గుర్తించి అతనిని అరెస్టు చేశారు. అతనితో ఉన్న కుమారుడిని తల్లికి అప్పగించారు. కొడుకుని కిడ్నాప్ చేసి హతమారుస్తాను అని బెదిరించిన తండ్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వ్యసనాలకు బానిసై కేవలం డబ్బు కోసమే రామకృష్ణారెడ్డి కొడుకుని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సమాజంలో మానవ సంబంధాలకు, అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది అని చెప్పటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. కన్న తండ్రే డబ్బు కోసం కొడుకునే కిడ్నాప్ చేసి చంపేస్తా అని బెదిరించటం సమాజం ఎలా మారుతుందో స్పష్టంగా చెప్తోంది.