చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లల్ని నదిలో పడేసి చంపిన తండ్రి ఇతడే...దారుణానికి దారి తీసిన కారణాలు:మద్యం మత్తులో!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:తన వేధింపులకు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన భార్య...తిరిగి ఇంటికి రమ్మంటే రానందని...మద్యం మత్తులో ఒకరి తర్వాత ఒకరిని...ముగ్గురు కుమారులను నదిలో విసిరేసి...ఆ తర్వాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు.

తెల్లవారి భార్య ఫోన్ చేస్తే పిల్లల్ని నదిలో విసిరేసిన సంగతి చెప్పాడు...దీంతో ఆమె నది వద్దకు వెళ్లి అక్కడ ముగ్గురు కొడుకుల మృతదేహాలు నీటిమీద తేలుతుండటం చూసి కుప్పకూలిపోయింది. ఈ విషయం తెలిసి రెండు ఊళ్ల జనాలు నది వద్దకు చేరారు. జరిగిన ఘోరాన్ని తల్చుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవి...

Father who killed three children: The reasons behind this Atrocity

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లె దళితవాడకు చెందిన వెంకటేశ్‌ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు తొలుత చిత్తూరు రూరల్‌ మండలం శెట్టిగారిపల్లె దళితవాడకు చెందిన అముదను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఈమెకు కుమార్తె పుట్టిన తరువాత మరదలు అమరావతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో మరదలు అమరావతిని రెండోపెళ్ళి చేసుకున్నాడు.

దీంతో విరక్తి చెందిన మొదటి భార్య అముద పుట్టింటికి వెళ్ళిపోయి తల్లివద్దే ఉంటోంది. ఆ తరువాత అమరావతికి ముగ్గురు మగపిల్లలు పునీత్‌ (6), సంజయ్‌ (3), రాహుల్‌ (10 నెలలు) కు జన్మనిచ్చింది. అయితే మద్యానికి బానిసైన వెంకటేష్‌ చిన్న విషయాలకు సైతం భార్యతో గొడవ పడి హింసిస్తుండేవాడు. అయితే అప్పటికే తన వల్ల అక్క పుట్టింటికి వెళ్ళిపోవడం...తాను కూడా భర్తను వదిలి వెళ్లిపోతే సమాజం తనని ఏమంటుందోననని వెంకటేష్‌ ఎంత హింసించినా అమరావతి సర్దుకుపోతూ కాపురం చేస్తూ వచ్చింది.

అయితే వారం క్రితం పెద్దకుమారుడు పునీత్‌ బాగా అల్లరి చేస్తుండటంతో అమరావతి కోపంతో చేయి చేసుకుంది. అయితే కొడుకును ఎందుకు కొట్టావంటూ వెంకటేశ్‌ భార్యపై చేయిచేసుకోవడంతో ఆమె ముగ్గురు పిల్లలనూ తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ఆదివారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి అత్తగారింటికి వెళ్ళాడు. ఊళ్లో ఆడికృత్తిక సందర్భంగా గ్రామస్థులంతా కావళ్ళు ఎత్తుతున్నందున, మన ఇంటికి పోదామంటూ భార్యను పిలిచాడు. అయితే అందుకు అమరావతి తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని, ఆమె ఇంటికిరాగానే వస్తానని చెప్పింది.

అయితే అప్పటికే బాగా మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ భార్య కావాలనే నిరాకరిస్తోందని భావించిఆమెపై మళ్లీ చేయి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. నువ్వు ఇక్కడే ఉండంటూ వెంకటేష్ తన ముగ్గురు కుమారుల్ని ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని శెట్టిగారిపల్లె నుంచి బాలగంగనపల్లెకు బయల్దేరాడు. మార్గమధ్యంలో చిత్తూరు-గంగాధరనెల్లూరు నడుమ వున్న నీవా నది బ్రిడ్జి వద్ద వాహనం ఆపి భార్యకు మళ్లీ ఫోన్‌ చేసి రమ్మని గొడవ పడ్డాడు. ఇప్పుడు నువ్వు నావెంట రాకుంటే ముగ్గు పిల్లల్ని నదిలో తోసేస్తానని బెదిరించాడు.

అయితే ఆమె నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనడంతో ఆగ్రహంతో రగిలిపోయిన వెంకటేష్...మధ్యం మత్తులో విచక్షణ కోల్పోయి కుమారులు ముగ్గురినీ ఒకరి తర్వాత ఒకరిని నదిలో విసిరేసి ఇంటికి వెళ్ళి పడుకుండిపోయాడు. సోమవారం ఉదయం అమరావతి భర్తకు ఫోన్‌ చేసి పిల్లలు ఎలా వున్నారని ఆరా తీయగా నదిలో తోసేసిన విషయం చెప్పాడు. దీంతో ఆమె పరుగుపరుగున నీవా నది బ్రిడ్జి వద్దకు వెళ్ళగా నదిలో తేలుతున్న పసివాళ్ళ మృతదేహాలు కనిపించాయి. దీంతో అమరావతితో సహా కుటుంబీకులు కుప్పకూలిపోగా గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సంఘటనతో బాలగంగనపల్లె దళితవాడ, శెట్టింగారిపల్లె రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. అయితే వెంకటేష్ గతంలో భార్యతో ఎన్నిమార్లు గొడవ పడినా పిల్లల్ని మాత్రం ప్రేమగా చూసుకునేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. మరి అంత దారుణంగా వారిని ఎలా చంపగలిగాడో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చనిపోయిన విషయం తెలిసి పారిపోయిన వెంకటేష్ మొబైల్ పై నిఘా పెట్టిన పోలీసులు సిగ్నళ్ల ఆధారం గా ఎస్‌ఆర్‌పురం సరిహద్దులోని కొల్లాగుంట వద్ద అదుపులోకి తీసుకున్నారు. అమరావతిని విచారించి పంపివేశారు. చిన్నారులకు సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

English summary
Chittoor:These are the reasons behind the father who killed three sons incident which created sensation in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X