హైకోర్టు విభజన ఎవరికి లబ్ధి: జగన్ భయంతో చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారా?
హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, న్యాయాధికారుల ఆప్షన్లపై తెలంగాణ లాయర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన తరుణంలో ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. అయితే హైకోర్టు విభజన అంశంపై ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని సమాచారం.
హైకోర్టు విభజనకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి వైసీపీ అధినేత వైయస్ జగన్ అడ్డంకిగా మారారా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ తెలంగాణలోనే నమోదైనందున హైకోర్టు విభజిస్తే ఏపీ ప్రభుత్వం వాటిపై పట్టు కోల్పోతుందనే ప్రచారం జరుగుతోంది.
హైకోర్టు విభజనలో రాజకీయ కోణం ఉందని, విభజన జరిగితే రాజకీయపరంగా నష్టపోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఏపీ సీఎం చంద్రబాబు అందుకు ససేమిరా అంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే... వైసీపీ అధినేత వైయస్ జగన్పై సీబీఐ కేసులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు విభజన జరిగితే ఆ కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదలీ అవుతాయి. ఈ పరిస్థితుల్లో జగన్ కేసులు తెలంగాణ హైకోర్టు, ఆ రాష్ట్ర పాలనా పరిధిలోనే నడుస్తాయి. జగన్ కేసులు తెలంగాణ ప్రాంతానికి బదలీ కావడం, తెలంగాణ ప్రభుత్వ పాలనలో విచారణ జరగడం చంద్రబాబుకు ఇష్టంలేదని సమాచారం.
అంతేకాదు జగన్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోనప్పటికీ, జగన్కు లబ్ధి చేకూరుతుందన్న అనుమానంతో ఏ కొద్ది అవకాశం కూడా ఇవ్వకూడదన్న భావనతో చంద్రబాబు వ్యవహారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగన్ అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చే వరకు హైకోర్టు విభజనకు అంగీకరించకుండా కాలయాపన చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండు ప్రభుత్వాలు తమ తమ కార్యాకలాపాలను చేసుకున్నప్పటికీ, హైకోర్టు విభజనకు చంద్రబాబు అడ్డుపడటం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సాకుగా చూపించి ఉమ్మడి హైకోర్టు విభజనను ఆమోదించేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు.

రాష్ట్ర విభజనలో తలెత్తిన సమస్యలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తుండగా హైకోర్టు విభజన, నదీజలాల పంపిణీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. తెలంగాణలోని న్యాయాధికారుల సస్పెన్షన్, లాయర్ల ఆందోళనలతో హైకోర్టు విభజన వ్యవహారంలో సానుకూల పరిష్కారం చూపేందుకు గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసి పరిస్థితులను వివరించిన నేపథ్యంలో ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ గవర్నర్ నరసింహాన్ బుధవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళుతున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆయన్ను కలవనున్నారు. హైకోర్టు విభజనపై చంద్రబాబుతో గవర్నర్ చర్చించనున్నారని తెలుస్తోంది.
అయితే దీనికి చంద్రబాబు ససేమిరా అంటున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగానే ఉండేందుకు అవకాశం ఉంది. అయితే ప్రతిష్టాత్మకమైన హైకోర్టుకు అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మించాకే విభజన ఉంటుందని సమాచారం.
అయితే పదేళ్లపాటు హైదరాబాద్లోనే ఉంటూ పరిపాలన సాగించేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పటికీ ఆఘమేఘాల మీద అమరావతికి సచివాలయాన్ని తరలించిన సీఎం హైకోర్టు విషయంలో ఎందుకు వెనకాడుతున్నారనేది అంతుబట్టని విషయం.
ఏదిఏమైతేనేం హైకోర్టు విభజన అంశంపై స్వయంగా గవర్నర్ రంగంలోకి దిగడంతో పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమో చూద్దాం.












Click it and Unblock the Notifications